
క్లుప్తంగా
కండక్టర్తో ఘర్షణ..
పరస్పర దాడి
● ముగ్గురికి గాయాలు
తిరువొత్తియూరు: బన్రూట్టి సమీపంలో ప్రభుత్వ బస్సులో చిల్లర తీసుకోవడంపై కండక్టర్ కు ప్రయాణకుల మధ్య ఏర్పడిన ఘర్షణలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇందులో కండక్టర్, బస్సులో ప్రయాణం చేస్తున్న తండ్రి కుమారుడితో సహా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కడలూరు జిల్లా బన్రూట్టి సమీపంలోని పైతం పాడి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మహేంద్రన్ (39). ఇతనికి కుమారుడు అజయ్ (14) ఉన్నాడు. కుమారుడిని పాఠశాలలో తొమ్మిదో తరగతి చేర్చడానికి ప్రభుత్వ బస్సు ఎక్కారు. ఆ సమయంలో ఆటో డ్రైవర్ మహేంద్రన్ కండక్టర్కు రూ.500 నోటు ఇచ్చి, రెండు టికెట్లు ఇవ్వమని కోరాడు. కండక్టరు 2 టికెట్లకు నగదు తీసుకుని, తర్వాత టికెట్, తక్కిన చిల్లర నగదును వారికి ఇచ్చాడు. నగదు ఇచ్చే సమయంలో ప్రయాణికుడు మహేందరన్ సెల్ఫోన్లో మాట్లాడుతుండడంతో అతను నగదును సరిచూసుకోమని కండక్టర్ చెప్పాడు. కానీ దీనిని చెవిలో వేసుకోకుండా మహేంద్రన్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. కొద్ది సమయం తర్వాత కండక్టర్ మహేంద్రన్తో నగదు సరిచూసుకోమని చెప్పాడు. దీంతో ఆగ్రహం చెందిన ప్రయాణికుడు మహేందరన్ కండక్టర్తో వాగ్వివాదం చేసి, ఒక దశలో ఒకరిపై ఒకరు ఇద్దరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. ఇందులో ప్రయాణికుడు మహేంద్రన్ అతని కుమారుడు అజయ్, కండక్టర్ ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురిని బన్రూట్టి ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పుదుపుపేటై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
బాలుడికి లైంగిక వేధింపులు
●కార్మికుడి అరెస్టు
తిరువొత్తియూరు: చైన్నె టీనగర్లో జుట్టు కత్తిరించుకోవడానికి వచ్చిన 15 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన కార్మికుడిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె టీనగర్ లోని ప్రముఖ సెలూన్ దుకాణానికి అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలుడు కటింగ్ కోసం వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న దుకాణం ఉద్యోగి జాన్ అనే వ్యక్తి బాలుడిని ప్రత్యేక గదికి తీసుకువెళ్లి మసాజ్ చేశాడు. తర్వాత లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలుడు ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు తెలిపాడు. దిగ్భ్రాంతి చెందిన బాలుడి తల్లిదండ్రులు సెలూన్ దుకాణం యజమాని స్టెల్లారాణితో ఫోన్లో సంప్రదించారు. ఈ విషయమై మాంబలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సెలూన్ ఉద్యోగి జాన్ను అరెస్టు చేశారు.
ఫార్మసిస్టుల నిర్లక్ష్యం శువు ప్రాణాలకు ముప్పు
అన్నానగర్: చైన్నెలోని ఫార్మసిస్టు నిర్లక్ష్యం కారణంగా రెండు నెలల శిశువు ప్రాణాలకు ముప్పు ఉందని ఆ శిశువు తల్లిదండ్రులు ఆరోపించారు. చైన్నెలోని బీసెంట్ నగర్ నివాసి మోసెస్ ఒక ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి రెండు నెలల బిడ్డ ఉంది. ఆ శిశువు పుట్టినప్పటి నుంచి కామెర్లు బారిన పడింది. దీంతో అతడు కేకే నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నాడు. వైద్యులు రాసిన మందులను అతడు 2 నెలలుగా తాను నివసిస్తున్న బీసెంట్ నగర్ రెండో ప్రధాన రోడ్డులోని అపోలో హాస్పిటల్స్ అనే పెద్ద ప్రైవేట్ ఫార్మసి నుంచి మందులు తీసుకుంటున్నాడు. ఆ మందు తీసుకుంటున్న పిల్లవాడు అసాధారణంగా అలసిపోయాడు. చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పుడు, సూచించిన దానికంటే శక్తివంతమైన మందును ఆ బిడ్డకు ఇచ్చారని వైద్యులు అతనికి తెలిపారు. వెంటనే ఫార్మసీలో దీని గురించి విచారించగా, వారు సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ విషయమై బాధిత బిడ్డ తల్లిదండ్రులు చైన్నె బీసెంట్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్థిరమైన
భవిష్యత్తు నిర్మాణం లక్ష్యం
సాక్షి, చైన్నె: ఐదు కీలక రంగాలపై దృష్టి సారిస్తూ సమగ్రమైన , స్థిరమైన భవిష్యత్తును నిర్మించడం లక్ష్యంగా తమ ప్రయత్నాలు విజయవంతంగా సాగినట్టు ఓపో ప్రకటించింది. గురువారం ఓపో 2024 సస్టైనబిలిటీ నివేదికను నిర్వాహకులు విడుదల చేశారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల అవగాహన కార్యక్రమంగా జనరేషన్ గ్రీన్ ద్వారా విద్యా సంస్థల్లో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమాల ద్వారా 10,339 కిలోల ఈ– వ్యర్థాలను సేకరించామన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కార్యాలయంలో వాతావరణ పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ వ్యవస్థ, ఉద్యోగుల సంరక్షణ వంటి అంశాలను చాటేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తద్వారా ‘మేక్ యువర్ మూమెంట్’ అనే బ్రాండ్ పునరుద్ధరణ ద్వారా ముందుకు సాగనున్నట్టు ప్రకటించారు. పర్యావరణ అనుకూల ఆవిష్కరణలు , బాధ్యతాయుతమైన సాంకేతికత ద్వారా స్థిరత్వాన్ని ప్రోత్సహించనున్నట్టు తెలిపారు.