
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య
వేలూరు: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను పునః ప్రారంభించడంతో వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట, తిరువణ్ణామలై జిల్లాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులంతా పాఠశాలల్లో చేరాలని అవగాహన ర్యాలీలు నిర్వహించారు. వేలూరు కొనవట్టంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కలెక్టర్ ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, షూ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. 5 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన ఉందని, ఇక్కడ విద్యను అభ్యసించిన అనేక మంది ఉన్నత పదువులు సాధించారన్నారు. తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల ఆకర్షణీయమైన ప్రకటనలకు మోస పోకుండా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో బోధన ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా సెలవులు ముగించుకొని పాఠశాలలకు వెళ్లడంతో కొందరు కన్నీటితో వెళ్లగా మరికొందరు సంతోషంతో ఆలయాల్లో పూజలు చేసి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని తరలారు. అదే విధంగా వేలూరు ఈవేరా ప్రభుత్వ పాఠశాల బాలికలకు టీచర్లు కర్పూర హారతి పట్టి చాక్లెట్లు అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సీఈఓ దయాళన్, మేయర్ సుజాత, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.