
ఆగిన వందేభారత్ రైలు
తిరుత్తణి: రైల్వే ట్రాక్ విద్యుత్ తీగలకు టార్ఫాలిన్ పట్ట చుట్టుకోవడంతో సోమవారం తిరుత్తణిలో వందేభారత్ రైలు సుమారు 40 నిమషాల పాటు ఆగింది. చైన్నె సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి వందేభారత్ రైలు తిరుత్తణి వైపు బయలు దేరింది. తిరుత్తణి రైల్వే స్టేషన్ సమీపంలో అరక్కోణం హైవే రోడ్డుకు సమీపంలో హైఓల్టేజ్ విద్యుత్ తీగలకు టార్ఫాలిన్ పట్ట చుట్టుకుంది. దాన్ని చూసిన ఇంజిన్ డ్రైవర్ వెంటనే రైలును ఆపాడు. వెంటనే అరక్కోణం రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొంత మంది ప్రయాణికులు ముందుకొచ్చి విద్యుత్ తీగలకు చుట్టుకున్న టార్ఫాలిన్ పట్టను పొడవైన కొయ్య సాయంతో తొలగించారు. దీంతో 40 నిమషాలు ఆలస్యంగా వందేభారత్ రైలు ముందుకు సాగింది. అరక్కోణం రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.