
బస్ టెర్మినల్ ప్రారంభం
సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బ్రహ్మాండ బస్ టెర్మినల్ను నిర్మించారు. దీనిని లెఫ్టినెంట్ గవర్నర్ కై లాసనాథన్, సీఎం రంగస్వామి శుక్రవారం ప్రారంభించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి నుంచి స్థానిక పరిసరాలు, కారైక్కాల్ పరిసరాలు, తమిళనాడులోని కడలూరు, నాగపట్నం, విల్లుపురం, చైన్నె వంటి నగరాలకు బస్సుల సేవలు జరుగుతున్న విషయం తెలిసిందే. అటు తమిళనాడు బస్సులు, ఇటు పుదుచ్చేరి ప్రభుత్వ బస్సులు ఇందులో ఉన్నాయి. అయితే, ఈ బస్సుల కంటూ ప్రత్యేకంగా శాశ్వత బస్టాండ్ పూర్తి స్థాయిలో లేదు. దీంతో ఇటీవల స్మార్ట్ సిటీ పథకం కింద పుదుచ్చేరిలో బస్ టెర్మినల్ నిర్మాణానికి సీఎం రంగస్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరమలై అడిగల్ సాలైలో రూ.29.50 కోట్ల వ్యయంతో బస్ టెర్మినల్ నిర్మాణ పనులు వేగవంతం చేశారు. రాజీవ్గాంధీ బస్ టెర్మినల్గా దీనికి నామకరణం చేశారు.
బ్రహ్మాండంగా..
పర్యాటకంగా ప్రసిద్ది చెందిన పుదుచ్చేరిలో ఎట్టకేలకు శాశ్వత బస్ టెర్మినల్ రూపుదిద్దుకుంది. 46 బస్సులు పార్క్ చేసేందుకు వీలుగా ప్లాట్ఫాంలు. ప్రయాణికుల సౌకర్యార్తం 31 వివిధ దుకాణాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే, 450 ద్విచక్ర వాహనాలు, 25 కార్లను పార్కింగ్ చేయడానికి వీలుగా చర్యలు తీసుకున్నారు. ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు ఇక బస్సుల సేవలు చేపట్టే విధంగా చర్యలు తీసుకున్నారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ బస్టాండ్ను లెఫ్టినెనెంట్ గవర్నర్ కై లాసనాథన్, సీఎం రంగస్వామి ప్రారంభించారు. ఇక్కడున్న వసుతులను పరిశీలించారు. వివిధ ప్రాంతాలకు సిద్ధం చేసిన కొత్త బస్సు సేవలకు జెండా ఊపారు. రానున్న కాలంలో ప్రయాణికలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఇక్కడ మరిన్ని ఏర్పాటు చేస్తామని, ఇక్కడి నుంచి వివిధ నగరాలకు సైతం బస్సు సేవలను విస్తరిస్తామని, పొరుగు రాష్ట్రాలకు సైతం సేవలపై దృష్టి పెడతామని సీఎం రంగస్వామి తెలిపారు. మంత్రులు నమశ్శివాయం, లక్ష్మీనారాయణన్, స్పీకర్ ఎన్బలం సెల్వం, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
● ప్రారంభించిన ఎల్జీ, సీఎం

బస్ టెర్మినల్ ప్రారంభం