
చైన్నెలో ఐదు విమానాల ల్యాండింగ్
●గంటన్నర తర్వాత బెంగళూరుకు..
సాక్షి, చైన్నె: బెంగళూరులో ల్యాండ్ కావాల్సిన ఐదు విమానాలు అర్ధరాత్రి వేళ చైన్నెలో ల్యాండ్ అయ్యాయి. గంటన్నర తర్వాత ఆ విమానాలు మళ్లీ టేకాప్ తీసుకున్నాయి. బెంగళూరు విమానాశ్రయంలో రద్దీ పెరిగినట్టు సమాచారం. బుధవారం అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ నుంచి 135 మంది ప్రయాణికులతో బెంగళూరుకు వెళ్లిన విమానం హఠాత్తుగా చైన్నెలో 12.30 గంటల సమయంలో ల్యాండింగ్ అయ్యింది. ఆ తర్వాత 296 మందితో కూడిన హాంకాంగ్ విమానంలో మరో 20 నిమిషాల వ్యవధిలో చైన్నెలో ల్యాండింగ్ తీసుకున్నారు. అనంతరం 1.20 గంటలకు నాగ్పూర్ నుంచి 127 మందితో వచ్చిన విమానం, 1.55 గంటలకు 154 మందితో గోవా నుంచి వచ్చిన విమానం, మరికాసేపటికి 327 మందితో వచ్చిన విదేశీ విమానం చైన్నెలో ల్యాండ్ అయ్యాయి. వీటన్నంటినీ విమానాల పార్క్ యార్డ్ వద్దకు తరలించారు. విమానం నుంచి ఏ ఒక్కర్ని కిందకు దించ లేదు. ఆయా విమాన యాన సంస్థల సిబ్బంది మాత్రం హడావుడిగా విమానాల వద్దకు ఉరకలు తీశారు. వాటర్ బాటిళ్లు, స్నాక్స్లను ప్రయాణికులకు అందజేశారు. బెంగళూరులో ల్యాండ్ కావాల్సిన విమానాలన్నీ చైన్నెకు రావడంతో కాసేపు టెన్షన్ నెలకొంది. అయితే బెంగళూరు విమానాశ్రయంలో అమాంతంగా పెరిగిన విమానాల రద్దీతో పార్కింగ్ సమస్య నెలకొన్నట్టు తేలింది. చివరకు గురువారం వేకువ జామున 2.30 నుంచి 3.30 గంటల మధ్యలో ఒకదాని తర్వాత మరొకటి బెంగళూరుకు విమానాలు టేకాఫ్ తీసుకున్నాయి.
సరికొత్త కిండిల్ పేపర్ వైట్ ఆవిష్కరణ
సాక్షి, చైన్నె: అత్యుత్తమ పనితీరు కనబరిచే రీతిలో పేపర్ వైట్ను అమెజాన్ ఆవిష్కరించింది. ఈ పేపర్వైట్ 25 శాతం వేగవంతమైన పేజీ మలుపులు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 వారాల పాటూ పని చేసే బ్యాటరీ సామర్థ్యంతో రూపకల్పన చేశారు. 7 అంగుళాల అతిపెద్ద డిస్ప్లేతో తీర్చిదిద్దారు. ఈ వివరాలను గురువారం స్థానికంగా అమెజాన్ ప్రకటించింది. కిండిల్ పేపర్వైట్ అన్నది చాలా సంవత్సరాలుగా పాఠకులలో ఓ ప్రసిద్ధి అని, కస్టమర్లు విలువైన అప్గ్రేడ్ చేసిన ఫీచర్లతో సరికొత్త కిండిల్ పేపర్వైట్ను ప్రారంభించడం తమకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కస్టమర్లు చదువుతున్నప్పుడు, అతిపెద్ద డిస్ప్లే అదనపు పఠన సౌకర్యాన్ని అందిస్తుందని, దీని తేలికై న డిజైన్ ప్రయాణంలో తీసుకెళ్లడానికి, చదవడానికి సౌకర్యంగా ఉంటుందని అమెజాన్ డివైసెస్ ఇండియా డైరెక్టర్, కంట్రీ మేనేజర్ దిలీప్ ఆర్ఎస్ వివరించారు. ఈ తాజా కిండిల్తో అమెజాన్లో అందుబాటులో ఉన్న భారతీయ, అంతర్జాతీయ శీర్షికలకు విస్తారమైన ఎంపిక నుంచి కథలను అన్లాక్ చేసే సౌకర్యం కల్పించామన్నారు.
ఒక్కరోజులో
14 వేల కోట్లకు కొన్నారు..!
సాక్షి, చైన్నె : అక్షయ తృతియ సందర్భంగా రాష్ట్రంలో బంగారం వ్యాపారం జోరుగానే జరిగింది. ఒక్క రోజు రూ.14 వేల కోట్ల మేరకు తమిళనాట వ్యాపారం జరిగినట్ట బంగారు వర్తకుల సంఘం నేత రాణా జయంతిలాల్ ప్రకటించారు. అక్షయ తృతీయ వేళ బుధవారం రాష్ట్రంలోని బంగారు దుకాణాలన్నీ కొనుగోలు దారులలో కిక్కిరిసిన విషయం తెలిసిందే. చైన్నె, తిరుచ్చి,కోయంబత్తూరు, మదురై, తిరునల్వేలి, వంటి నగరాలలో వ్యాపారం జోరుగానే సాగింది. జనం ఏమాత్రం తగ్గమన్నట్టుగా ధర పెరిగినా బంగారం అంతా కొనేశారన్నట్టుగా పరిస్థితి నెలకొంది. గత ఏడాది 17 వేల కోట్లకు రెండురోజుల పాటూ వ్యాపారం అన్నది జరిగితే, ప్రస్తుతం ఒక్కరోజు 14 వేల కోట్లకు అమ్మకాలు జరిగినట్టు వర్తక సంఘం నేత పేర్కొనడం గమనార్హం. గత ఏడాది బంగారం ఒక సవరం 50 నుంచి 55 వేలలోపు ఉంటే, ఈ ఏడాది రూ. 70వేలు దాటినా జనం తగ్గలేదు. అక్షయ తృతియ గడి వేల బంగారంగా కొనేశారు. రూ. 14 వేల కోట్ల మేరకు తమిళనాట బంగారం వర్తకం జరిగినట్టు ఆ సంఘం నేత రాణా జయంతి లాల్ పేర్కొనడం గమనార్హం. బంగారం అమ్మకాలు ఓ వైపు ఉంటే మరోవైపు భూముల రిజిష్ట్రేషన్లు సైతం పొద్దు పోయే వరకు జరగడం గమనార్హం. ఈ రిజిస్ట్రేషన్లకారణంగా ప్రభుత్వానికి రూ. 272.87 కోట్లు బుధవారం ఒక్క రోజు ఆదాయం వచ్చినట్టు ఆ శాఖ మంత్రి మూర్తి ప్రకటించారు.

చైన్నెలో ఐదు విమానాల ల్యాండింగ్

చైన్నెలో ఐదు విమానాల ల్యాండింగ్