
నిమ్మ ధరలకు రెక్కలు
పళ్ళిపట్టు: వేసవి ఎండల ప్రభావంతో నిమ్మపండ్లు దిగుబడి గణనీయంగా తగ్గడంతో వాటి ధరలు రెండింతలు పెరిగాయి. వేసవి ఎండలు భగ్గుమంటున్నాయి. ఎండ వేడిమితో ఆరోగ్యానికి చల్లదనం ఇచ్చే పండ్లు తీసుకునేందుకు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా ఆరోగ్యానికి చల్లదనం ఇచ్చే నిమ్మపండు జ్యూస్కు అధిక సంఖ్యలో ఉత్సాహం చూపుతున్నారు. ఆహారంతోపాటు పూజలకు వినియోగించే నిమ్మపండ్లను వేసవి ఎండల తీవ్రతతో జ్యూస్ తాగేందుకు ప్రతి ఒక్కరూ కొనుగోలు చేస్తున్నారు. దీంతో నిమ్మపండ్ల వ్యాపారం రెండింతలుగా పెరిగింది. అదే సమయంలో వేసవి ఎండల తీవ్రతతో నిమ్మ దిగుబడి గణనీయంగా తగ్గింది. ఏప్రిల్ తొలివారం వరకు కోయంబేడు, తిరుత్తణి మార్కెట్లో కేజీ నిమ్మపండ్లు రూ.60 వరకు హోల్సేల్ ధరలకు వ్యాపారులు విక్రయించేవారు. గత వారం రోజులుగా నిమ్మ మార్కెట్కు రావడం తగ్గి, డిమాండ్ పెరిగింది. పెద్ద సైజు నిమ్మపండ్లు కేజీ రూ.160, చిన్న సైజు రూ.140కి విక్రయిస్తున్నారు. దీంతో రూ.5కు విక్రయించిన పెద్దసైజు నిమ్మ ప్రస్తుతం రూ.10, చిన్న సైజు రూ.5కు విక్రయిస్తున్నట్లు నిమ్మ పండ్లు వ్యాపారి చక్రాల రఘుపతి తెలిపారు. నిమ్మ దిగుబడి తగ్గడంతో ఆంధ్రాలోని కడప, రాజంపేట, కోడూరు ప్రాంతాల నుంచి సరఫరా తగ్గినట్లు తెలిపారు. దీంతో ధరలు గణనీయంగా పెరిగినట్లు మరో నెల రోజులపాటు నిమ్మపండ్లు ధరలు తగ్గే అవకాశం లేదని తెలిపారు.