
మాజీ మంత్రిని అరెస్టు చేయాలని ధర్నా
తిరుత్తణి: మహిళా సమాజాన్ని కించ పరిచే విధంగా బహిరంగ సభలో మాట్లాడిన మాజీ మంత్రి పొన్ముడిని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలనే డిమాండ్తో తిరుత్తణిలో అన్నాడీఎంకే మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. డీఎంకే సీనియర్ నాయకుడు, పొన్ముడి బహిరంగ సభలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినట్లు ఆరోపణలతో పార్టీ పదవి, మంత్రి పదవి సైతం కోల్పోయాడు. ఈ క్రమంలో పొన్ముడిని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలనే డిమాండ్తో ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా తిరుత్తణిలో అన్నాడీఎంకే మహిళా విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ మాజీ మంత్రి, జిల్లా కార్యదర్శి రమణ, మాజీ ఎంపీ హరి, జిల్లా ఎన్నికల పరిశీలకుడు విజయకుమార్ తదితరులు పాల్గొని ధర్నాలో ప్రసంగించారు. తిరుత్తణి నియోజకవర్గం వ్యాప్తంగా నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, అన్నాడీఎంకే శ్రేణులు పాల్గొని మాజీమంత్రి పొన్ముడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. డీఎంకే ప్రభుత్వంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించి సామాన్యులకు భద్రత కొరవడిందని, మహిళలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు తలెత్తినట్లు ఆరోపించారు. ఈ మేరకు ధర్నా చేశారు. అన్నాడీఎంకే శ్రేణులు సౌందర్రాజన్, ఈఎన్.కండ్రిగ రవి, టీడీ.శ్రీనివాసన్, రవిచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.