
ఏడుగురిని బలికొన్న బాణసంచా
సేలం : రాష్ట్రంలో సంభవించిన వేర్వేరు బాణాసంచా పేలుడు ప్రమాదాలలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. సేలం జిల్లా ఓమలూరు సమీపంలో ఉన్న కంజనాయకన్పట్టిలో ద్రౌపది అమ్మవారి ఆలయం ఉత్సవాలు 28 ఏళ్ల తర్వాత జరుపుతున్నారు. ఈ సందర్భంగా రోజూ అమ్మవారికి ఊరేగింపు సమయంలో బాణాసంచా పేల్చుతున్నారు. 15వ రోజు వేడుక శుక్రవారం రాత్రి జరిగింది. అప్పుడు పూజారిపట్టి ప్రాంతం నుంచి గంజనాయకన్పట్టికి భక్తులు అమ్మవారికి సారెను తీసుకువెళ్లారు. వారి వెంట మూడు బైక్పై రూ. 3 లక్షల విలువ చేసే బాణాసంచాను తరలించారు. వారి వెంట ఇద్దరు యువకులు బైక్లపై తీసుకువస్తున్న బాణాసంచాను తీసి దారి పొడవునా పేలుస్తూ వచ్చారు. అప్పుడు ఒక నిప్పు రవ్వ బైక్పై ఉన్న బాణాసంచాపై పడి భారీ ప్రమాదం సంభవించింది. బాణాసంచా పేలడంతో ముగ్గురు ఘటనా స్థలంలో శరీరాలు ఛిద్రమై మృతి చెందారు. మృతులు కంజనాయకన్పట్టికి చెందిన సెల్వరాజ్ (29), సుబ్రమణి కుమారుడు కార్తీ (12), సేట్ కుమారుడు తమిళ్ సెల్వన్ (11) అని గుర్తించారు. తీవ్రంగా గాయపడిన లోకేష్ (20)ని సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి చికిత్స ఫలించక లోకేష్ కూడా మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు పెరిగింది. అదే విధంగా గాయపడిన అదే ప్రాంతానికి చెందిన గణేష్ ప్రభు (28), నవీన్ ప్రభు (32)లు సేలంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తలా రూ. 3 లక్షల సహాయ నిధిని ప్రకటించారు. ఈ స్థితిలో పర్యాటక శాఖ మంత్రి రాజేంద్రన్ శనివారం నలుగురి కుటుంబీకులకు తలా రూ. 3 లక్షల చెక్కులను అందజేశారు. ఆయనతో పాటు కలెక్టర్ బృందాదేవి, డీన్ దేవి మీనాల్, ప్రభుత్వ శాఖ అధికారులు కూడా ఉన్నారు. అదేవిధంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి మృతుల కుటుంబీకులకు సంతాపాన్ని ప్రకటించారు.
శివకాశిలో ముగ్గురు
విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలో నాగ్పూర్ అనుమతి పొందిన ఓ కర్మాగారంలో 100కు పైగా గదులు ఉన్నాయి. మహిళలు, పురుషులు అంటూ 300 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 11 గంటల సమయంలో అకస్మాత్తుగా ఓ గదిలో పెలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మారియమ్మాల్ (51), తిరువాయ్మొళి (45), భాగ్యలక్ష్మి (55) అనే ముగ్గురు మహిళలు శరీరాలు ఛిద్రమై ఘటనా స్థలంలోనే మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం శివకాశి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పుదుపట్టి పోలీసులు కేసు నమోదు చేసుకుని, యజమాని జైశంకర్ వద్ద విచారణ జరుపుతున్నారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం
ఆరుగురికి తీవ్రగాయాలు

ఏడుగురిని బలికొన్న బాణసంచా