
బ్రిడ్జి నిర్మాణ ప్రాంతం పరిశీలన
తిరువళ్లూరు: 20 గ్రామాల ప్రజల రాకపోకల కోసం రూ.20.37 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేయనున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించిన క్రమంలో సంబంధిత స్థలాన్ని గ్రామీణాభివృద్ధిశాఖ అడిషనల్ డైరెక్టర్ సుమతి అధికారులతో కలిసి పరిశీలించారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరిలో సీఎం గత 18న పర్యటించి రూ.2లక్షల మందికి సంక్షేమ పథకాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాకు మూడు బ్రిడ్జీలు సహా వేర్వేరు పనులను ప్రారంభించనున్నట్టు వరాల జల్లును కురిపించారు. ఇందులో భాగంగానే 50 ఏళ్ల నుంచి బ్రిడ్జి కోసం చేస్తున్న ఆందోళనను గుర్తించే క్రమంలో తండలం నుంచి కసువ నల్లాత్తూరు వరకు రూ.20.37 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేయనున్నట్టు ప్రకటించారు. పనులు జరగనున్న ప్రాంతాన్ని గ్రామీణాభివృద్ధిశాఖ అడిషనల్ డైరెక్టర్ సుమతి, ఈఈ రాజవేలు పరిశీలించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే 30 గ్రామాలకు చెందిన ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని స్థానికులు వివరించారు. పంచాయతీ మాజీ అధ్యక్షుడు ఉమ, మణి, కార్మిక సంఘం నేత విక్రమాదిత్యన్ పాల్గొన్నారు.
మంత్రి పదవులు ఊడేనా..?
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ఇద్దరు మంత్రుల పదవులు ఊడేనా అన్న చర్చ ఊపందుకుంది. ఈ ఇద్దరు కోర్టు కేసులను ఎదుర్కొంటున్న వాళ్లు కావడం గమనార్హం. మనీ లాండరింగ్ కేసులో అరెస్టుయిన సెంథిల్ బాలాజీ మంత్రి పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. బెయిల్ మీద బయటకు వచ్చినాననంతరం మళ్లీ పదవి దక్కించుకున్నారు. అయితే, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్దాఖలైంది. ఈ విచారణ అనేక మలుపులతో సాగుతోంది. తాజాగా బెయిలా..మంత్రి పదవినా అన్న సందిగ్ధంలో సెంధిల్ బాలాజీనిపడేస్తూ బుధవారం విచారణ సమయంలో న్యాయమూర్తులు స్పందించడం గమనార్హం. ఆయన మంత్రి పదవి రాజీనామా చేస్తారా? అనే చర్చ ఊపందుకుంది. అలాగే, వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరకాటంలో పడ్డ సీనియర్మంత్రి పొన్ముడిపై బుధవారం మద్రాసు హైకోర్టు తీవ్రంగానే స్పందించింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయక పోవడం దురదృష్టకరం అని న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి వర్గంలో మార్పునకు సీఎం స్టాలిన్ ఏదేని చర్యలు చేపట్టేనా అన్న చర్చ జోరందుకుంది. ఇందుకు కారణం, ఈ ఇద్దరు మంత్రుల వ్యవహారంను ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకుని పోరాటాలను ఉధృతం చేస్తుండటమే.