
జాక్టో జియో ఆధ్వర్యంలో ధర్నా
తిరువళ్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జాక్టో జియో ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక మెడికల్ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జాక్టోజియో రాష్ట్ర కోర్డినేటర్లు దాస్, జ్ఞానశేఖరన్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా జ్ఞానశేఖరన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని సూచించారు. ఎన్నికల సమయంలో డీఎంకే ఇచ్చిన హామీలను సైతం నాలుగేళ్లుగా మూలన పడేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పింఛన్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయుల మధ్య ఉన్న వేతన వ్యత్యాసాలను వెంటనే సరి చేయాలన్నారు. ప్రభుత్వ జీవో 243ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో తమ పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సంఘం నేతలు ప్రభాకరన్, బాలసుబ్రమణ్యం, రాజాజీ, దివ్య, షేక్గఫూర్, గణేషన్, కార్తవరాయన్, జవహర్, మురళీ తదితరులు పాల్గొన్నారు.