
ఆకట్టుకున్న దుర్యోధన వధ
తిరుత్తణి: ద్రౌపదీ దేవి ఆలయ వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం దుర్యోధన వధ గ్రామీణులను అమితంగా ఆకట్టుకుంది. తిరుత్తణి సమీపం ఎస్.అగ్రహారం గ్రామంలో ద్రౌపదీదేవి ఆలయ తిరనాళ్లు మే 29న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. 12 రోజులపాటు నిర్వహించిన వేడుకల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు చేపట్టి గ్రామ వీధుల్లో ఊరేగించారు. అగ్నిగుండ వేడుకలు సందర్భంగా భక్తులు కంకణాలు ధరించి, దీక్షలు చేపట్టారు. ఆదివారం ఉదయం దుర్యోధన వధ నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు ఎస్.అగ్రహారం చుట్టు పక్కల గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దుర్యోధనుడు, భీముడు వేషధారణ చేసిన కళాకారులు దుర్యోధన వధ నాటకాన్ని పాటలు ద్వారా ప్రదర్శించారు. చివరగా దుర్యోధనుడి మరణంతో గాంధారి జనులను చీపుర్లతో కొట్టే సన్నివేశం ప్రదర్శించారు. యువకులు, మహిళలు గాంధారి వేషధారణ చేసిన కళాకారుడితో చీపుర్లతో కొట్టించుకున్నారు. రాత్రి 7 గంటలకు అగ్నిగుండ వేడుకలు సందర్భంగా 500 మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించారు. సోమవారం ధర్మరాజుల పట్టాభిషేకంతో అగ్నిగుండ వేడుకలకు ముగింపు పలుకుతారు.