
ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు
బేస్మెంట్ పూర్తయిన లబ్ధిదారుడి ఖాతాలో రూ.లక్ష చొప్పున జమ
కోదాడరూరల్: పేదల సొంతింటి కల సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మొదటి విడత బిల్లులు వచ్చేశాయి. జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ముగ్గుపోసి బేస్మెంట్ వరకు పూర్తిచేసిన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష చొప్పున పడుతున్నాయి. ఇప్పటి వరకు 291 మంది ఖాతాల్లో రూ.2.91కోట్లు జమ అయ్యాయి.
మొదటి విడత రూ.లక్ష చొప్పున..
మండలానికి ఒక గ్రామం చొప్పున జిల్లాలో 23 గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతగా బేస్మెంట్ లెవల్ వరకు పూర్తి చేసిన వారి ఖాతాల్లో రూ.లక్ష చొప్పున జమఅవుతున్నాయి. ఈ 23 గ్రామాల్లో దరఖాస్తు చేసుకున్నవారిలో 3,240 మందిని అధికారులు అర్హులుగా గుర్తించారు. గ్రౌండింగ్ పూర్తి చేసిన వారు 791 మంది ఉన్నారు. వీరిలో బేస్మెంట్ వరకు పూర్తి చేసిన 291 మందికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం 2.91కోట్లు వారిఖాతాల్లో జమ అయ్యాయి.
600 చదరపు అడుగులకు మించి కట్టుకుంటే..
400 నుంచి 600 చదరపు అడుగుల లోపు విస్తీర్ణం పెట్టుకొని ఇంటి నిర్మాణం చేపట్టి బేస్మెట్ పూర్తయిన లబ్ధిదారులందరికీ మొదటి విడత బిల్లులు పడ్డాయి. 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో కట్టుకున్న వారికి బిల్లులు పడలేదు. ప్రభుత్వ నిబంధల ప్రకారం ఇల్లు నిర్మించుకున్న వారి వివరాలను, ఇంటి కొలతలను ఆన్లైన్లో నమోదు చేస్తే ఆటోమెటిక్గా నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం ఉందా లేదా అనే విషయాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. నిబంధనలకు లోబడి కట్టుకున్న వారికి వెంటనే బిల్లులు వస్తున్నాయని అంటున్నారు. వీరిలో కొందరు తెలియక ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించుకుంటే మరికొందరు తెలిసికూడా కట్టుకున్నవారు ఉన్నారు. అయితే 600 అడుగుల విస్తీర్ణం కంటే మించి నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు రావడంలేదు.
అర్హత జాబితాలో ఉన్నవారు
వెంటనే పనులు మొదలు పెట్టాలి
మొదటి విడతలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాల్లో అర్హుల జాబితాలో పేర్లు ఉన్న వారు వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులు సూచిస్తున్నారు. పనులు మొదలు పెట్టి బేస్మెంట్ పూర్తి చేసుకుంటే మొదటి విడత బిల్లులు పడతాయని అంటున్నారు.
ఫ జిల్లా వ్యాప్తంగా 291 మందికి రూ.2.91కోట్లు..
ఫ 3,240 మందిని అర్హులుగా గుర్తించిన అధికారులు
ఫ 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపు నిర్మించుకుంటున్న వారికే బిల్లులు
ఇందిరమ్మ ఇళ్ల పథకం వివరాలు..
నియోజకవర్గం పైలట్ అర్హులు గ్రౌండింగ్ రూ. లక్ష జమ
గ్రామాలు అయినవారు
సూర్యాపేట 4 257 75 24
తుంగతుర్తి 6 431 108 16
కోదాడ 6 962 329 172
హుజూర్నగర్ 7 1590 279 79
600 చదరపు అడుగుల లోపే నిర్మించుకోవాలి
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇష్టానుసారంగా ఇళ్లను నిర్మించుకొని ఇబ్బందులు పడొద్దు. 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగుల లోపు విస్తీర్ణంలో కట్టుకోవాలి. ఈ నిబంధలమేరకు ఇళ్లు నిర్మించుకుంటే ఎలాంటి ఇబ్బందులులేకుండా ఉంటుంది. అదే విధంగా అర్హత జాబితాలో పేరున్న వారు కూడా ఇంటి పనులు ప్రారంభించాలి.
– ధర్మారెడ్డి, హౌసింగ్ పీడీ సూర్యాపేట జిల్లా