ఇక.. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ | - | Sakshi
Sakshi News home page

ఇక.. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ

Apr 30 2025 5:14 AM | Updated on Apr 30 2025 5:14 AM

ఇక..

ఇక.. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ

హుజూర్‌నగర్‌ : గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేసి పేదలను దోచుకుంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రీ ప్రైమరీ(నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ) విధానం ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం ప్రవేశపెట్టే అంశాన్ని విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. తాజాగా సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో తమకు ఆర్థిక భారం తగ్గనుందని పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు భావిస్తున్నారు.

ఉచితంగా యూనిఫామ్‌, పుస్తకాలు, భోజనం

ప్రీ ప్రైమరీ తరగతుల ఏర్పాటులో ప్రభుత్వ బడుల ఆవరణలోని అంగన్‌వాడీ కేంద్రాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జిల్లాలో మొదట దాదాపు సగానికిపైగా ప్రాథమిక పాఠశాలల్లో బోధన ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులతో ఎంపిక చేసిన బడులను గుర్తించి రాష్ట్ర విద్యా శాఖకు నివేదిక అందజేయనున్నారు. కొత్తగా ప్రీ ప్రైమరీ ప్రారంభించే చోట ఉపాధ్యాయులను నియమించే అవకాశం ఉంది. పిల్లలకు పుస్తకాలతోపాటు యూనిఫామ్‌, రాగిజావ, మధ్యాహ్న భోజనం తదితరాలను ఉచితంగా అందించనున్నారు.

ప్రాథమిక విద్య బలోపేతంపై దృష్టి

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల ఏర్పాటు చేయడం ద్వారా ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని సర్కారు దృష్టిపెట్టింది. ఇటీవల ఓ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుపై మాట్లాడడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 690 ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలలు 78 వరకు ఉన్నాయి. వాటిల్లో 1–5 తరగతులు చదివేవారు 20 వేల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. గతంలో సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమ తరగతులు ప్రారంభించినప్పుడు ప్రవేశాల సంఖ్య పెరిగింది. ఇక్కడ ఒకటో తరగతి నుంచి ప్రవేశాలు కల్పిస్తుండడంతో అంగన్‌న్‌వాడీ కేంద్రాల నుంచి కొందరు ప్రైవేట్‌ పాఠశాలకు వెళుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన సర్కారు ప్రీ ప్రైమరీ విధానం అమలుకు మొగ్గుచూపుతోంది.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యకు సన్నాహాలు

తాజాగా నిర్ణయం తీసుకున్న సర్కారు

వచ్చే ఏడాది నుంచి అమలుకు యోచన

విద్యా సామర్థ్యాలు మెరుగుపడతాయి

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచన చేయ డం మంచిదే. ఈ విధానం అమలు అయితే సర్కారు పాఠశాలల్లోనే నర్సరీ నుంచి యూకే జీ వరకు విద్య అందనుంది. తద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో కనీస విద్యా సామర్థ్యాలు మెరుగవుతాయి. ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం అవుతాయి.

– అశోక్‌, డీఈఓ, సూర్యాపేట

ఇక.. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ1
1/1

ఇక.. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement