● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
కాకాణి గోవర్ధన్రెడ్డి
పొదలకూరు: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎన్నికల్లో ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు కూటమి కట్టాడు. దాని వల్ల కూడా కాదని గ్రహించి కుట్రలకు తెరతీశాడు. ఏకంగా సీఎంను అంతమొందించాలని చూశాడు’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. మండలంలోని మర్రిపల్లి, కొనగలూరు, రామాపురం, దుగ్గుంట, దుగ్గుంటరాజుపాళెం, ఊట్లపాళెం, కొత్తకంభాలపల్లి గ్రామాల్లో మంత్రి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రిపల్లిలో మాట్లాడుతూ రోజురోజుకు తన గ్రాఫ్ పడిపోతుండడంతో చంద్రబాబు హత్యా రాజకీయాలకు బరితెగించాడని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం చూసి ప్రజలు ఓట్లు వేస్తారని, ఇది జీర్ణించుకోలేకే బాబు దారుణాలకు ఒడిగడుతున్నాడన్నారు. పేదలకు మేలు చేయాలనే జగన్ సంకల్పాన్ని ఎవరూ ఆపలేరన్నారు.
సోమిరెడ్డిని అడగండి
ఐదేళ్లకొక పర్యాయం గ్రామాలకు వచ్చే టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి ఓటేస్తారా? గ్రామాలను అభివృద్ధి చేసిన తనకు ఓటేస్తారా? అని కాకాణి ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో ఆయన ఎక్కడ ఉన్నాడో అడిగి తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. సర్వేపల్లిలో రూ.130 కోట్లతో ఆర్అండ్బీ రోడ్లను నిర్మించామని, రూ.375 కోట్లతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించానని మంత్రి వెల్లడించారు. రూ.100 కోట్లతో జల్జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి కనెక్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇన్ని చేసిన తనను ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ, సర్పంచ్లు కోసూరు అంకమ్మ, వెంకటరమణయ్య, ఎంపీటీసీలు రావుల దశరథరామయ్యగౌడ్, కేతు రామిరెడ్డి, నాయకులు రావుల అంకోజీ, జి.గోపాలయ్య తదితరులు పాల్గొన్నారు.