యర్రగొండపాలెం: మండలంలోని వాదంపల్లిలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. నీటి ట్యాంకర్ల వద్ద వచ్చిన వివాదంతో పెద్ద ఎత్తున ఇరువర్గాల వారు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఒక వర్గానికి మద్దతుగా సమీప గ్రామమైన అమానిగుడిపాడు గ్రామానికి చెందిన వారు వందల సంఖ్యలో తరలివచ్చారు. వివాదం విషయం తెలియడంతో సీఐ ఆర్.రాములు నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామానికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు ఇరువర్గాలకు చెందినవారు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఒక వర్గానికి చెందిన వారు తమ వర్గీయులకు నీటి సరఫరాను నిలిపివేశారు. రెండో వర్గానికి చెందిన నీటి ట్యాంకర్ వద్ద ప్రత్యర్థి వర్గీయులు నీటికోసం వెళ్లి అక్కడ గొడవకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వీధుల్లో మోహరించి ఇరువర్గాల వారిని బయటికి రానీయకుండా చేశారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్బాబు ఆధ్వర్యంలో చేరుకున్న అదనపు పోలీసు బలగాలు పక్క గ్రామం నుంచి వచ్చిన వారిని తరిమికొట్టారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. కంభం సీఐ రామకోటయ్య, ఎస్సైలు సుదర్శన్, వెంకటసైదులు, అంకమరావు, నరసింహారావు తదితరులు బందోబస్తులో పాల్గొన్నారు.
గ్రామంలో మోహరించిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment