హమ్మయ్య... సన్‌రైజర్స్‌ గెలిచింది

SRH Beat Delhi Capitals By 15 Runs - Sakshi

అబుదాబి: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎట్టకేలకు గెలిచింది. వరుసగా రెండు ఓటములతో తర్వాత విజయాన్ని సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. 162 పరుగుల స్కోరును కాపాడుకుని విజయకేతనం ఎగురవేసింది. సన్‌రైజర్స్‌ బౌలింగ్‌లో రాణించడంతో సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించినా గెలుపును అందుకుంది. కాగా, హ్యాట్రిక్‌ విజయాన్ని ఖాతాలో వేసుకుందామనుకున్న ఢిల్లీ ఆశలు తీరలేదు. ఢిల్లీ ఆటగాళ్లలో శిఖర్‌ ధావన్‌(34; 31 బంతుల్లో 4 ఫోర్లు), రిషభ్‌ పంత్‌(28; 27 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), హెట్‌మెయిర్‌(21; 12 బంతుల్లో 2 సిక్స్‌లు)లు మాత్రమే మోస్తరుగా ఆడటంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్‌  కుమార్‌ రెండు వికెట్లు సాధించాడు. నటరాజన్‌, ఖలీల్‌ అహ్మద్‌కు వికెట్‌కు దక్కింది. ఢిల్లీని 147 పరుగులకే కట్టడి చేసిన ఆరెంజ్‌ ఆర్మీ ఖాతా తెరిచింది.

అంతకుముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 163  పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. సన్‌రైజర్స్‌ ఆటగాళ్లలో డేవిడ్‌ వార్నర్‌(45; 33 బంతుల్లో 3 ఫోర్లు,  2 సిక్స్‌లు), జానీ బెయిర్‌ స్టో(53; 48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), కేన్‌ విలియమ్సన్‌( 41; 26 బంతుల్లో  5 ఫోర్లు)లు రాణించడంతో పోరాడే స్కోరును ఉంచకల్గింది. టాస్‌ గెలిచిన ఢిల్లీ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకోవడంతో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌కు దిగింది. సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ను వార్నర్‌, బెయిర్‌ స్టోలు ధాటిగా ఆరంభించారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 77 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత వార్నర్‌ ఔటయ్యాడు.

అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. వార్నర్‌ బ్యాట్‌ ఎడ్జ్‌కు తగిలిన బంతిని పంత్‌ పట్టడంతో పెవిలియన్‌ చేరాడు. ఇక మనీష్‌ పాండే(3) నిరాశపరిచాడు. మిశ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడే ప‍్రయత్నంలో రబడా క్యాచ్‌ పట్టడంతో పాండే ఔటయ్యాడు. ఆ తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన విలియమన్స్‌ ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న విలియమన్స్‌ వచ్చిన దగ్గర నుంచి మంచి టచ్‌లో కనిపించాడు. బెయిర్‌ స్టోతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. బెయిర్‌ స్టో మూడో వికెట్‌గా ఔట్‌ కాగా, రబడా వేసిన ఆఖరి ఓవర్‌లో షాట్‌ కొట్టిన విలియమ్సన్‌ పెవిలియన్‌ చేరాడు. అబ్దుల్‌ సామద్‌(12 నాటౌట్‌; 7 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించడంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో రబడా, మిశ్రాలు తలో రెండు వికెట్లు సాధించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top