
ఈనెల 29 నుంచి ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్
న్యూఢిల్లీ: ఈనెల 29న ప్రారంభం కానున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో పోటీపడే పలు జట్లు తమ కెప్టెన్లను ప్రకటించాయి. తమిళ్ తలైవాస్ కొత్త కెప్టెన్గా పవన్ సెహ్రావత్, వైస్ కెప్టెన్గా అర్జున్ దేశ్వాల్ వ్యవహరిస్తారు. గత సీజన్లో తమిళ్ తలైవాస్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. 22 మ్యాచ్ల్లో ఆ జట్టు కేవలం ఎనిమిది మ్యాచ్ల్లో గెలిచి ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించడంలో విఫలమైంది. తొమ్మిదో సీజన్ వేలంలో తమిళ్ తలైవాస్ రూ. 2 కోట్ల 26 లక్షలు చెల్లించి పవన్ను కొనుగోలు చేసింది.
అయితే ఆ సీజన్లో పవన్ ఆడిన తొలి మ్యాచ్లోనే గాయపడి సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. సీజన్ ముగిశాక పవన్ను తలైవస్ విడుదల చేయగా... తెలుగు టైటాన్స్ రూ. 2 కోట్ల 60 లక్షలు వెచ్చించి పవన్ను సొంతం చేసుకుంది. రెండు సీజన్లపాటు టైటాన్స్కు పవన్ ప్రాతినిధ్యం వహించినా ఆశించిన ఫలితాలు రాలేదు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి అయిన పవన్ 2019 దక్షిణాసియా క్రీడల్లో, 2023 ఆసియా చాంపియన్షిప్లో స్వర్ణ పతకాలు నెగ్గిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మరోవైపు మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ జట్టు కెప్టెన్గా అంకిత్ జగ్లాన్, వైస్ కెప్టెన్గా దీపక్ సింగ్... యూపీ యోధాస్ జట్టు కెప్టెన్గా సుమిత్ సాంగ్వాన్, వైస్ కెప్టెన్గా అశు సింగ్ నియమితులయ్యారు.