
● మృగశిర కార్తె ఆరంభం నుంచే విక్రయాల సందడి ● ఆస్తమా, ఉ
పుల్కల్(అందోల్): మృగశిర కార్తె ఆరంభం రోజే చేపలు తింటే ఆస్తమా, ఉబ్బసం వంటి వ్యాధులు రావని చాలామంది నమ్ముతుంటారు. ఆదివారం మృగశిర ప్రారంభం కావడంతో చేపలకు మంచి గిరాకీ లభిస్తుంది. ఇక జిల్లాలో సింగూరు చేపకున్న డిమాండ్ అయితే చెప్పనవసరం లేదు.
పసందుగా చేప....
జిల్లాలో ఉన్న ఏకై క భారీ నీటిపారుదల సింగూరు బహుళార్థసాధక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు జిల్లా ప్రజలకు, జంట నగరాల ప్రజలకు తాగునీటిని, స్థానికంగా సాగునీటిని అందిస్తుంది. జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా మత్స్యకారులకు ఉపాధిని కల్పించి వారి జీవితాల్లో సిరులు పూయిస్తుంది. ఈ ప్రాజెక్టులో చేపలు పట్టుకుని వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. సింగూరు డ్యాంలో పెరిగే చేపలు రుచికరంగా ఉంటాయని చేప ప్రియులు చెబుతుంటారు. ఇక్కడ పెరిగిన చేపలు హైదారాబాద్తోపాటు, జిల్లాలో పలు ప్రాంతాల ప్రజలు ఇష్టంగా తింటారు. ప్రాజెక్టుకు వచ్చిన పర్యాటకులు చాలామంది చేపలు కొని తీసుకెళ్తారంటే అతిశయోక్తి కాదు.
ప్రభుత్వమే చేప పిల్లల విడుదల...
సింగూరు భారీ నీటి పారుదల ప్రాజెక్టు కావడంతో ప్రభుత్వమే చేప పిల్లలను విడుదల చేస్తుంది. ఏటా 60 నుంచి 70 లక్షల చేప పిల్లలను, రొయ్య పిల్లలను విడుదల చేస్తుంది. దీంతో ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలు చాలామంది చేపల వృత్తిని ఎన్నుకుని ఉపాధి పొందుతున్నారు.
జోరుగా విక్రయాలు
మత్స్యకారులు పట్టిన చేపలను కొందరు వ్యాపారులు ఆటోల్లో తరలించి సమీప పట్టణాల్లో విక్రయిస్తారు. స్థానికులు మాత్రం అక్కడే ప్రాజెక్టు సమీపంలో షెడ్లు వేసుకుని విక్రయాలు చేపడతారు. మృగశిర నాడు ప్రత్యేక కౌంటర్లు పెట్టి విక్రయాలు చేపడతారు. ప్రస్తుతం డ్యాంలో 18 టీఎంసీల వరకు నీరు ఉండటంతో చేపల సంపద వృద్ధి చెందుతుంది.
ప్రతీ ఊళ్లో విక్రయాలు
గ్రామాల్లో చెరువుల్ని మత్స్యకారులకే ప్రభుత్వం అప్పగించి, చేప పిల్లలు సరఫరా చేయడంతో ఊరూరా చేపల విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో జీవించే మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. సాధారణ చేపలు కిలో రూ.150 కాగా కొర్రమీను లాంటి రకాలు కిలో రూ.350కు విక్రయిస్తారు. మృగశిర నాడు మాత్రం రెట్టింపు ధరలతో విక్రయిస్తారు.
చేపలు పట్టడమే జీవనాధారం
సింగూరు డ్యాంలో చేపలు పట్టి వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. చాలా ఏళ్ల నుంచి చేపల వేట ప్రధాన జీవనాధారం. ప్రభుత్వం మత్స్యకారులకు లైసెన్స్లు ఇచ్చి పలు ప్రోత్సాహకాలిస్తుంది. పట్టిన చేపల్లో కొన్ని స్థానికంగా విక్రయించి మిగతావి వ్యాపారులకు హోల్సేల్ ధరలకు సరఫరా చేస్తాం.
–టేకు లక్ష్మణ్ (మత్స్యకారుడు,సింగూరు)
మార్కెట్ ఏర్పాటు చేయాలి
ప్రాజెక్టులో మత్స్యకారులు మూడు దశాబ్దాలుగా చేపలు పట్టి ఉపాధి పొందుతున్నారు. చేపల మార్కెట్ లేక మత్స్యకారులు దళారులకు సరఫరా చేస్తున్నారు. స్థానికంగా చేపల మార్కెట్ ఏర్పాటుచేయాలి. మత్స్యశాఖకు పట్టున్న సింగూరులో మార్కెట్ ఏర్పాటు చేస్తే మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుంది.
–నందికంటి శ్రీనివాస్ (సింగూరు మత్స్యకార
సంక్షేమ సంఘం, అధ్యక్షుడు)