
ఉల్లాస్తో అతివకు అక్షరకాంతి
సంగారెడ్డి టౌన్ : ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. మహిళల సాధికారితకు, అభివృద్ధికి విద్య ఎంతో దోహదపడుతుంది. అయితే జిల్లాలో మహిళలు మాత్ర అక్షరాస్యతలో వెనుకబడే ఉన్నారు. కనీసం సంతకం కూడా చేయడం రాని వారు లక్షల్లో ఉన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వాలు ‘న్యూ ఇండియా లిటరసీ’కార్యక్రమం అమలుకు చర్యలు తీసుకుంటుండగా, ముందుగా పొదుపు సంఘాల మహిళల్లో అక్షర కాంతులు నింపాలని నిర్ణయించింది. విద్యాశాఖ సహకారంతో ‘సెర్ప్’అధికారులు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్న్ఇన్ సొసైటీ) పేరిట కార్యచరణను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి ఏపీడీ, డీపీఎంలకు రాష్ట్రస్థాయి ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించగా జిల్లాలో త్వరలో కార్యక్రమాలు చేపడుతున్నారు.
18 ఏళ్లు నిండిన వారిని గుర్తించి...
ప్రధానంగా మహిళా సంఘాల సభ్యులపై దృష్టిసారించింది. వారిలో 18 ఏళ్లు నిండిన వారిని గుర్తించి అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యంగా నిర్దేశించారు. జిల్లా డీఆర్డీవో, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా చేపడుతున్న ఉల్లాస్ కార్యక్రమంలో నిరక్షరాస్యులను గుర్తించేందుకు ఇప్పటికే సర్వేను ప్రారంభించారు. ముందుగా గ్రామైఖ్య సంఘాల్లో చదువు రాని వారిని గుర్తిస్తారు. జిల్లాలో ఇప్పటివరకు 45,352 మంది మహిళలను గుర్తించారు. సంఘంలోనే చదువు వచ్చిన వారిని వాలంటీరుగా నియమించి అక్షరాలు నేర్పిస్తారు. జిల్లాలోని ఆయా గ్రామాలలో సర్వే పూర్తిచేసి ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారని తేల్చనున్నారు. వీరిలో ఐదు మందికి ఒక వాలంటీరును నియమించమన్నారు.
ఆర్డీఓ, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ
ఉల్లాస్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. డీఆర్జీడీవోతోపాటు విద్యాశాఖ అధికారులు పర్యవేక్షిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీవో, ఎంఈవో, ఐకేపీ ఏపీఎం, గ్రామస్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు వీఏవో అధ్యక్షురాలు, కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకొచ్చింది. సర్వే వివరాలను అందులో పొందుపరచనున్నారు. పదో తరగతిలోపు మానేసిన వారిని ఓపెన్్ పది, పదో తరగతితో ఆపేసిన వారిని ఓపెన్ ఇంటర్ చదివేలా ప్రోత్సహిస్తారు. ఇంటర్ పూర్తిచేసిన వారిని డిగ్రీ చేయించాలని నిర్ణయించారు. ఒకవేళ సంఘాల్లో చదివేవారు లేకపోతే సభ్యుల పిల్లలతో ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయించారు. సర్వే పూర్తవగానే వాలంటీర్ల సాయంతో కార్యక్రమం షురూ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
చదువు నేర్చుకుంటాను
చదువు నేర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న నాకు చదువు నేర్పించడానికి జిల్లా మహిళా సంఘం మంచి నిర్ణయం. నాతో పాటు చాలామంది చదువులు రాని వాళ్లం నేర్చుకుంటాం.
–అమృత, ఇస్మాయిల్ ఖాన్ పేట సంఘం సభ్యురాలు
గ్రామంలో మహిళలకు శిక్షణ ఇస్తాం
గ్రామాలలోని చదువురాని మహిళలకు ప్రతీరోజు కొంత సమయం కేటాయించి చదువు నేర్పిస్తాం. చదువుతోపాటు రాయడానికి వచ్చే విధంగా శిక్షణను కల్పిస్తాం. వారి సాధికారతకు నేను కూడా కృషి చేస్తా. –రేణుక, సంగారెడ్డి మహిళా సంఘం
అవగాహన కల్పిస్తున్నాం
మహిళా సంఘంలోని సభ్యులకి నిరక్షరాస్యులకు చదువు చెప్పేందుకు కార్యాచరణ రూపొందించాం. విద్యాశాఖ అధికారులు, డీఆర్డీవో ఆధ్వర్యంలో సమష్టిగా ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటాం. –జంగారెడ్డి, అదనపు డీఆర్డీఓ
పొదుపు మహిళలకు చదువులు
ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్న అధికారులు
జిల్లాలో 45,352 మంది మహిళా నిరక్షరాస్యులు
త్వరలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు