
అమీన్పూర్ ఇక మహానగరమే
● తాజాగా జానకంపేట, వడకపల్లి గ్రామాలు విలీనం
● రికార్డులు సమర్పించిన పంచాయతీ సిబ్బంది
పటాన్ చెరు: అమీన్పూర్ మండల పరిధిలో మిగిలిన రెండు గ్రామాలను కూడా మున్సిపాలిటీ పరిధిలోకి విలీనం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం ఆ రెండు గ్రామాల కార్యదర్శులు సిబ్బంది అందరూ మున్సిపాలిటీకి రికార్డులను సమర్పించారు. ఒకప్పుడు పటాన్చెరువు మండలంలో అంతర్భాగంగా ఉన్న అమీన్పూర్ 2018 ఆగస్టులో మున్సిపాలిటీగా ఏర్పడింది. ఆ తర్వాత కొత్త మండలాల ఏర్పాటు క్రమంలో పటేల్ గూడ, కిష్ణారెడ్డిపేట, వడక్పల్లి, జానకంపేట, ఐలాపూర్, ఐలాపూర్ తాండ గ్రామాలను అమీన్పూర్లో విలీనం చేసి మండలంగా రూపొందించారు. తాజాగా గురువారం అమీన్పూర్ మండల పరిషత్ పరిధిలో ఉన్నటువంటి జానకంపేట, వడకపల్లి గ్రామాలు అమీన్పూర్ మున్సిపల్ పాలన పరిధిలోకి వచ్చాయి. దీంతో అమీన్పూర్ మండల పరిషత్ కార్యాలయం కార్యకలాపాలు ప్రశ్నార్థకంగా మారాయి. కొన్ని నెలల క్రితం కిష్ణారెడ్డిపేట, పటేల్ గూడ, ఐలాపూర్, ఐలాపూర్ తాండ సుల్తాన్పూర్, దాయర, గండిగూడ గ్రామాలను అమీన్పూర్ పట్టణంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.
మున్సిపాలిటీ పరిధిలోకి పారిశుద్ధ్య కార్మికులు
అమీన్పూర్ మండల పరిధిలో ఒక్క గ్రామం కూడా జిల్లా పరిషత్ పరిధిలో లేకుండా పోయింది. ఇదే విషయంలో జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా ‘సాక్షి’తో మాట్లాడుతూ..మున్సిపల్ పరిధిలోకి విలీనమైన పంచాయితీ కార్యదర్శులను మాత్రమే పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉన్న ఖాళీల్లో భర్తీ చేస్తామన్నారు. ఇక పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, కారోబార్లు మున్సిపాలిటీ పరిధిలోకి వెళ్తారని స్పష్టం చేశారు. జెడ్పీ సీఈఓ జానకిరామ్ మాట్లాడుతూ...అమీన్పూర్ ఎంపీడీవో ఆఫీసు పరిధిలోని సిబ్బంది వివరాలను ఉన్నతాధికారులకు పంపించామని వారి ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ పరిధిలోనే ఉన్న ఖాళీల్లో వారిని భర్తీ చేస్తామని వివరించారు. అయితే అమీన్పూర్ ఎంపీడీవో ఆఫీస్ కార్యకలాపాలు ముగిసినట్లేనని స్పష్టం చేశారు. అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ జానకంపేట వడకపల్లి గ్రామాలను మున్సిపాలిటీలో విలీన ప్రక్రియ ముగిసిందన్నారు. ఆ పంచాయతీల రికార్డులను స్వాఽధీనం చేసుకున్నట్లు చెప్పారు.