
ఇక జోన్ల వారీగా పారిశుద్ధ్యం
సంగారెడ్డి జోన్: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రోజువారీగా పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టడంతోపాటు పర్యవేక్షణకు ప్రత్యేకంగా జోన్లను ఏర్పాటు చేసింది. ఇంటింటికీ చెత్తసేకరణ, మురికి కాలువల నిర్వహణ, రహదారుల పరిశుభ్రతతో పాటు తడి, పొడి వేరు చేయడం, సేకరణ మరింతగా మెరుగుపరచనున్నారు.
631గ్రామపంచాయతీలు..1,464 జోన్లు
జిల్లాలో 26 మండలాలు ఉండగా 631 గ్రామపంచాయతీలున్నాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో 2,32,670 ఇండ్లు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో ఇండ్ల సంఖ్య, జననివాసం, మార్కెట్లు, సంస్థలు, వ్యాపార సంస్థల ఆధారంగా జోన్లను ఏర్పాటు చేశారు. ప్రతీ గ్రామపంచాయతీలో రెండు నుంచి ఆరు వరకు విభజించారు. ప్రతీ జోన్కు సంబంధిత పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తారు. ప్రతీరోజు ఆ జోన్లో చెత్త సేకరణతోపాటు పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వం చేపట్టిన పారిశుద్ధ్య జోన్ల ద్వారా మెరుగైన ఫలితాలు రానున్నాయని అధికారులు చెబుతున్నారు.
జనాభా, ఇండ్ల ఆధారంగా విభజన
మల్టీపర్పస్ వర్కర్లకు బాధ్యతలు
ఇన్చార్జిలుగా వ్యవహరించనున్న కార్యదర్శులు, ఎంపీఓ
ప్రత్యేక యాప్లో నమోదు
జోన్ల వారీగా ప్రతీరోజు చేపట్టిన పారిశుద్ధ్య పనుల నిర్వహణ తదితర అంశాలను నమోదు చేసేందుకు మానిటరింగ్ యాప్లో పంచాయతీ కార్యదర్శి నమోదు చేయాల్సి ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికుల హాజరు, సేకరించిన చెత్తను తూకం వేయడం, పారిశుద్ధ్య పనుల ఫొటోలు తదితర వివరాలు పొందుపరచాలి. ఒక గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన జోన్లకు సంబంధిత పంచాయతీ కార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎంపీఓ, ఎంపీడీఓ, డీఎల్పీఓ, డీపీఓతో పాటు ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. అయితే జిల్లాలో జోన్లను ఏర్పాటు చేసినప్పటికీ వాటి నిర్వహణ మాత్రం చేపట్టడం లేదు.