
శాశ్వత నీటి ఎద్దడి నివారణకు చర్యలు
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: నియోజకవర్గంలోని తండాలు, గ్రామాలతోపాటు ఖేడ్ మున్సిపాలిటీలో శాశ్వతంగా తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. అమృత్ –2 పథకం ద్వారా రూ.13 కోట్లతో చేపట్టే పనుల్లో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని చాంద్ఖాన్పల్లిలో గురువారం తాగునీటి సరఫరా పైపులైను పనులకు భూమిపూజ చేసి ప్రారంభించారు. అంతకుముందు ఖేడ్ మండలం పోతన్పల్లి, గునుకులకుంట, మాధ్వార్, లింగనాయక్పల్లి, లింగాపూర్, హన్మంతరావుపేట, మాద్వార్ తండాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే సంజీవరెడ్డి భూమిపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో 5 వేల వరకు నల్లా కనెక్షన్లు ఉండగా గత పాలకులు 1,200 కనెక్షన్లు మాత్రమే ఉన్నట్లు ప్రతిపాదనలు పంపడంవల్ల అమృత్ పథకంద్వారా రూ.13 కోట్లు మాత్రమే మంజూరయ్యాయన్నారు. అమృత్ –3 పథకంలో భాగంగా నిధుల మంజూరుకోసం ప్రతిపాదనలు పంపుతామన్నారు. గొర్రెకల్లో డెడికేటెడ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయించి తాగునీటి సరఫరాకు విద్యుత్ సమస్యలు లేకుండా చేశామన్నారు. ఇళ్లులేని పేదలందరికీ ఇళ్లను మంజూరు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అర్హులైన వారందరికీ ఇందిరమ్మ పథకం కింద ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్, హౌసింగ్ డిప్యూటీ ఈఈ సతీశ్తివారీ, నాయకులు పండరీరెడ్డి, రమేశ్ చౌహాన్, శంకర్ ముదిరాజ్ పాల్గొన్నారు.