
చెట్ల నరికివేతకు అడ్డేది?
● అటవీ భూములను కబ్జా చేస్తున్నఅక్రమార్కులు ● చోద్యం చూస్త్తున్న అటవీ అధికారులు
జహీరాబాద్ టౌన్: అటవీ విస్తీర్ణం పెంచేందుకు ఒక పక్క మొక్కలు నాటుతుంటే మరో పక్క అక్రమార్కులు చెట్లను నరికివేస్తున్నారు. అటవీ భూములను కబ్జా చేసి వ్యవసాయ భూములుగా మార్చుతున్నారు. పర్యవేక్షించాల్సిన అటవీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో పచ్చని చెట్లు అంతరించిపోతున్నాయి. జహీరాబాద్ అటవీ డివిజన్ పరిధిలో జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్ మండలాల పరిధిలో అటవీ ప్రాంతం ఉంది. పలు రకాల చెట్లు ఉండగా అటవీ శివారులోని చెట్లను కొందరు నరికివేస్తున్నారు. అధికారుల ఉదాసీనత వల్ల అటవీ సంపద అంతరించిపోగా అటవీ భూమి కబ్జాకు గురవుతోంది. మొగుడంపల్లి మండలంలోని గౌసాబాద్ గ్రామం వరకు అటవీ ప్రాంతం ఉంది. గ్రామ సమీపంలో ఉన్న చెట్లు, మొక్కలను అక్కమార్కులు తొలగించి చదును చేస్తున్నారు. అటవీ భూమి కబ్జాకు గురవుతున్న విషయాన్ని గ్రామానికి చెందిన వారు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవు. బీట్ అధికారులున్న పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గౌసాబాద్తోపాటు పలు గిరిజన తండా పరిసర ప్రాంతాల్లోని అటవీ శాఖకు చెందిన చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అటవీ భూమిని పోడు పేరుతో వ్యవసాయ భూమిగా మార్చుకుని పంటలను సాగుచేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి పచ్చని చెట్లు అంతరించిపోకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.