
ఆపరేషన్ వికటించి వ్యక్తి మృతి
చేవెళ్ల: ఆపరేషన్ వికటించి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గురువారం చేవెళ్లలో చోటుచేసుకుంది, పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని కేసారానికి చెందిన కల్లెంల నర్సింలు (50) వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు. ఇతనికి కడుపులోని బొడ్డు వద్ద గడ్డ ఉందని వైద్యులు గుర్తించారు. ఈక్రమంలో గత బుధవారం విజయ్ నర్సింగ్హోంకు వెళ్లి డాక్టర్ విజయ్కుమార్ను కలిశాడు. చిన్న ఆపరేషన్ ద్వారా తొలగించేద్దామని చెప్పడంతో ఆస్పత్రిలో చేరాడు. సాయంత్రం వేళ శస్త్రచికిత్స చేసి గడ్డను తొలగించారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం నర్సింలు నోరు తడి ఆరిపోతోందని, పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు డాక్టర్కు చెప్పారు. ఏమీ కాదని చెప్పిన ఆయన గ్లూకోజ్ పెట్టినా, ఎక్కకపోవడంతో అనుమానం వచ్చి మహేందర్రెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే నర్సింలు చనిపోయాడని ఆరోపిస్తూ అతని బంధువులు మృతదేహంతో వచ్చి విజయ్ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. అప్పటికే డాక్టర్లందరూ వెళ్లిపోయారు. పోస్టుమార్టం నిమిత్తం బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మమ్మ, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.
చేవెళ్లలో ఘటన
విజయ్ నర్సింగ్హోం ఎదుట బాధితుల ఆందోళన
కేసు నమోదు చేసిన పోలీసులు