
నేటి నుంచి బడిబాట
● ప్రవేశాల పెంపే లక్ష్యంగా ముందుకు..
● స్కూళ్లకు చేరిన పుస్తకాలు
గంభీరావుపేట(సిరిసిల్ల): పాఠశాలల్లో విద్యార్థుల నమోదే లక్ష్యంగా ఉపాధ్యాయులు శుక్రవారం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట చేపట్టనున్నారు. ఈనెల 19 వరకు కొనసాగే బడిబాటలో ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల పెంపే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అందుతున్న సౌకర్యాలు, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనంపై ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రవేశాల పెంపు, బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్చడం, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. విద్యార్థుల తల్లిదండ్రులను, గ్రామపెద్దలను, స్థానిక ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను, యువజన సంఘాలను భాగస్వామ్యం చేయనున్నారు.
బడికి చేరిన పుస్తకాలు
విద్యాసంవత్సరం ప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పటికే సరఫరా చేసింది. జిల్లాలో ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలలు 535 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో దాదాపు 50వేలకు పైగా విద్యార్థులు ఉన్నారు. 2,70,587 పుస్తకాలు అవసరం కాగా ఇప్పటికే 2,54,937 పుస్తకాలు వచ్చాయి. నాలుగో తరగతి తెలుగు, 9, 10వ తరగతులకు సంబంధించిన పర్యావరణవిద్య పాఠ్యపుస్తకాలు మాత్రమే రావాల్సి ఉంది.