
‘పది’లో ఐదో స్థానం
● 128 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత ● 10 కేజీబీవీలు శతకొట్టాయి ● ఆరు గురుకులాలు అదుర్స్
సిరిసిల్ల ఎడ్యుకేషన్: పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ఐదో స్థానంలో నిలిచింది. జిల్లాలోని 198 ఉన్నత పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షకు హాజరవగా 128 స్కూళ్లు 100 శాతం ఉత్తీ ర్ణత సాధించాయి. జిల్లా వ్యాప్తంగా 6,754 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 6,629 మంది ఉత్తీర్ణత సాధించారు. 98.15 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్ర స్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 13 కేజీబీవీలలో 10 కేజీబీవీలు శతశాతం ఫలితాలు సాధించాయి. జిల్లాలో ఉన్న ఏడు గురుకులాల్లో ఆరు 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు గురుకులాల సమన్వయ అధికారి థెరిస్సా తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా విద్యాధికారి జనార్దన్రావు అభినందించారు.
కేజీబీవీల్లో..
13 కేజీబీవీల్లో 506 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 503 మంది ఉత్తీర్ణులయ్యారు. 99.41 ఉత్తీర్ణత శాతం నమోదైనట్లు ఎస్వో పద్మజ తెలిపారు. 13 కేజీబీవీలలో 10 కేజీబీవీలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. సిరిసిల్ల కేజీబీవీలో శ్రీనిత్య 566, ఇల్లంతకుంటలో అర్చిత 564, తంగళ్లపల్లిలో కృష్ణవేణి 563 మార్కులు సాధించినట్లు తెలిపారు.
గురుకులాల్లో 580 మార్కులు
జిల్లాలో ఏడు గురుకుల విద్యాలయాలు ఉండగా ఆరు వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు గురుకుల సమన్వయ అధికారి థెరిస్సా తెలిపారు. ముస్తాబాద్ గురుకులంలో జె.విగ్నేశ్ 580, అరుణ్కుమార్ 579, చిన్నబోనాలలో జి.సాత్విక, ఇల్లంతకుంటలో కె.మీనాక్షి, నర్మాలలో జి.నిహారిక 579 మార్కులు సాధించారు.
విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు
పదోతరగతి ఫలితాల్లో ప్రతిభచూపిన జిల్లా విద్యార్థులను కలెక్టర్ సందీప్కుమార్ ఝా అభినందించారు. కలెక్టరేట్లో పుష్పగుచ్ఛాలు అందించి, సన్మానించారు. ప్రైవేట్ స్కూల్కు చెందిన పి.వర్షిణి 591 మార్కులు సాధించి, ఓవరాల్గా జిల్లాలో మొదటిస్థానంలో నిలిచింది.