
వేసవిలోనూ పౌష్టికాహార సేవలు
బోయినపల్లి/ఎల్లారెడ్డిపేట: గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు వేసవి సెలవుల్లోనూ పౌష్టికాహారం అందిస్తామని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. మంగళవారం కొదురుపాక, ఎల్లారెడ్డిపేట సెక్టార్లలో టీచర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ఎండాకాలం నెలరోజుల పాటు పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలో 15 రోజులపాటు ఆయాలు, మరో 15 రోజులు టీచర్లకు సెలవులు ప్రకటించామని వివరించారు. కేంద్రంలో ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉండి ప్రభుత్వం నిర్దేశించిన సేవలు అందించాలని కోరారు. జిల్లా ఉమెన్ ఎంపవర్మెంట్ కో ఆర్డినేటర్ రోజా, ఐసీడీఎస్ సూపర్వైజర్లు శంకరమ్మ, కళావతి, టీచర్లు పాల్గొన్నారు.