
భూసమస్యలు భూభారతితో పరిష్కారం
సిరిసిల్ల: భూమి సమస్యలు భూభారతి చట్టంతో పరిష్కారమవుతాయని, ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. సిరిసిల్ల శివారులోని చంద్రంపేట రైతువేదికలో సోమవారం భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధరణి స్థానంలో కొత్తగా భూమిహక్కుల రికార్డు– భూభారతి రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిందని తెలిపారు. హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం ఉందన్నారు. భూముల మ్యాప్ జియోట్యాగింగ్తో పాస్బుక్కులు జారీ చేస్తామని వివరించారు. పెండింగ్ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. మ్యూటేషన్ చేసి రికార్డులలో నమోదు చేస్తారని వివరించారు. పాసుపుస్తకాల్లో భూమి పటం ఉంటుందని స్పష్టం చేశారు. ఇంటి స్థలాలకు ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు ఉంటుందని తెలిపారు. మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చినా, ప్రభుత్వం, భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. భూసమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళికతో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపారెడ్డి, సిరిసిల్ల ఇన్చార్జి తహసీల్దార్ విజయ్ భాస్కర్రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ సంగీతం శ్రీనివాస్ పాల్గొన్నారు.
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా