
‘సెస్’ ఆస్తులను రక్షించాలి
● స్టోర్స్కు స్థలం సాధించాలి ● అక్రమ విద్యుత్ కనెక్షన్లు నియంత్రించాలి ● విద్యుత్ బకాయిలు వసూలు చేయాలి ● అవినీతి రహితంగా సేవలందించాలి ● సిరిసిల్ల ‘సెస్’ మహాజన సభలో సభ్యులు ● మిడిల్ పోల్స్ వేసి సమస్యలు పరిష్కరిస్తాం ● సభలో ‘సాక్షి’ కథనాన్ని ప్రస్తావించిన చైర్మన్ చిక్కాల రామారావు
సిరిసిల్ల: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఆస్తులను రక్షించాలని, అవినీతి రహితంగా సేవలందించాలని సంస్థ 51వ మహాజన సభలో సభ్యులు కోరారు. సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో చైర్మన్ చిక్కాల రామారావు అధ్యక్షతన గురువారం నిర్వహించిన మహాజన సభలో మాట్లాడారు. జిల్లాలో 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు 76 ఉండగా.. కొత్తగా మరో 17 కొత్త సబ్స్టేషన్లు మంజూరయ్యాయని, టెండర్ల దశలో ఉన్నాయన్నారు. అదనంగా మరో 10 సబ్స్టేషన్లకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో స్థలం కేటాయించాల్సి ఉందన్నారు. జిల్లాలో 132/33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు ఆరు ఉండగా.. మరో రెండు నేరెళ్ల, బోయినపల్లిల్లో ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. ‘సెస్’ను ఎన్పీడీసీఎల్లో కలపాలని కొందరు అవగాహన లేక మాట్లాడుతున్నారని, సహకార రంగంలో దేశంలోనే అత్యుత్తమ సంస్థగా ‘సెస్’కు పేరుందన్నారు. ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ కంటే మెరుగైన సేవలు అందిస్తున్నామని రామారావు వివరించారు. విద్యుత్ కనెక్షన్ల మేరకు సిబ్బంది లేకున్నా.. సమర్థంగా, పారదర్శకంగా సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. వ్యవసాయానికి 5 హెచ్పీల వరకే ఉచిత కరెంట్ను ఇస్తున్నారని, కొందరు 7.5, 10, 15 హెచ్పీల మోటార్లను అక్రమంగా అమర్చి విద్యుత్ను వాడుకుంటున్నారని, అలాంటి వారు విద్యుత్ కనెక్షన్లను క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుంచి బకాయిలు వస్తే సంస్థ లాభాల్లోకి వస్తుందన్నారు. ‘సెస్’లో అక్రమంగా నియామకమై ప్రమోషన్లు పొందిన వారిపై విచారణ కమిటీని వేసి, కమిటీ సిపార్సుల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
సభలో ‘సాక్షి’ కథనం ప్రస్తావన
‘సెస్’ స్టోర్స్కు సిరిసిల్లలోని పాతస్థలాన్ని అప్పగించాలని, లేదా.. ఐదెకరాల స్థలంతోపాటు రూ.10 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నా రు. ఎల్లారెడ్డిపేట పోలీస్స్టేషన్లో ఉన్న ‘సెస్’ సేవా సదన్ను, 20 గుంటల స్థలాన్ని సంస్థకు స్వాధీనమయ్యేలా కృషి చేస్తామన్నారు. ఈ అంశంపై ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని చైర్మన్ సభలో ప్రస్తావించారు. ‘సెస్’లో కొత్త రిక్రూట్మెంట్లను ఎన్పీడీసీఎల్ ద్వారా పారదర్శకంగా నియమిస్తామని స్పష్టం చేశారు. ‘సెస్’ ఎండీ పి.విజయేందర్రెడ్డి సంస్థ వార్షిక నివేదికను వివరించారు. ఆదాయ, వ్యయాలు, అంచనా బడ్జెట్, ప్రతిపాదిత లక్ష్యాలను ‘సెస్’ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ‘సెస్’ వైస్చైర్మన్ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు దిడ్డి రమాదేవి, దా ర్నం లక్ష్మీనారాయణ, మల్లుగారి రవీందర్రెడ్డి, గౌ రినేని నారాయణరావు, చందుపట్ల అంజిరెడ్డి, వ రుస కృష్ణహరి, మాడుగుల మల్లేశం, పొన్నాల శ్రీని వాస్రావు, ఆకుల గంగారాం, నామాల ఉమ, రేగులపాటి హరిచరణ్రావు, ఆకుల దేవరాజం, కొట్టెపల్లి సుధాకర్, ‘సెస్’ అధికారులు, ‘సెస్’ విలేజీ ప్రాతినిథ్య సభ్యులు ఉన్నారు.
సభ్యుల వాగ్వాదం
మహాజనసభలో సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకే వ్యక్తి ఎజెండా అంశాలన్నీ ప్రస్తావించడాన్ని తప్పుపడుతూ అందరికీ అవకాశం ఇవ్వాలని సభ్యులు కోరారు. దీనిపై సభ్యుల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. చప్పట్లు కొట్టండి అంటూ.. ‘సెస్’ చైర్మన్ రామారావు పదే పదే కోరడాన్ని సభ్యులు తప్పు పట్టారు. చప్పట్లు కొడితే.. అంశాన్ని ఆమోదించినట్లే కదా.. అంశాన్ని చర్చించిన తరువాతే చప్పట్లు కొడతామని సభ్యులు వివరించారు.
కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలి
మా మండలానికి మల్లన్నసాగర్ నీళ్లు వస్తున్నాయి. రైతులు కాల్వల్లో మోటార్లు పెట్టి పొలాలు పారించుకుంటున్నారు. ఉన్న ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్లోడ్ అవుతుంది. కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలి. అక్రమ కనెక్షన్లు తొలగించాలి. ఏఈఈలు, ‘సెస్’ సిబ్బంది బాగా పని చేస్తున్నారు. విద్యుత్ బకాయిల వసూళ్లకు సహకరిస్తాం.
– కల్వకుంట్ల గోపాల్రావు, మోహినికుంట

‘సెస్’ ఆస్తులను రక్షించాలి