
ప్రజావాణి లేదని తెలువక..
● కలెక్టరేట్కు వచ్చిన పలువురు ● కలెక్టర్ లేక.. ప్రజల గోడు వినేవారు కరువు ● ఉసూరుమంటూ ఇంటిదారి
సిరిసిల్ల: ప్రతీ సోమవారం కలెక్టరేట్ నిర్వహించే ప్రజావాణి ఎప్పటి మాదిరిగానే ఈవారం కూడా ఉంటుందనే ఆశలో వచ్చిన పలువురు లేదని తెలిసి ఉసూరుమంటూ వెనుదిరిగారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా రెండు రోజుల ముందే తాను హైదరాబాద్కు కోర్టు పనిపై వెళ్తున్నానని, సోమవారం ప్రజావాణి రద్దు చేసినట్లు ప్రకటించారు. ఆ సమాచారం జిల్లా ప్రజలు అందరికీ చేరకపోవడంతో చాలా మంది ప్రజావాణి ఉంటుందనే భావనతో కలెక్టరేట్ వరకు వచ్చి నిరాశకు గురయ్యారు. వచ్చిన వారిలో అత్యధికులు చదువురాని వారు. కలెక్టర్ అందుబాటులో లేకుంటే.. జిల్లాలో ఉన్న ఇతర ఉన్నతాధికారులు ప్రజావాణి నిర్వహించే అవకాశం ఉంది. గతంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ప్రజావాణి నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. కానీ రాజన్నసిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేనట్లు కలెక్టరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
చేతిలో నీళ్ల సీసా.. జబ్బపై కాటన్ తువ్వాలతో ఉన్న ఈ దంపతులు ఇరుమల్ల కనకవ్వ, కొమురయ్య. బోయినపల్లి మండలం విలాసాగర్. గ్రామంలో డ్రెయినేజీ నీళ్లు పోనీయకుండా.. పైపులైన్ వేయకుండా.. స్థానికులు అడ్డుకుంటున్న సమస్యను ప్రజావాణిలో తెలిపేందుకు వచ్చారు. ప్రజావాణి లేదని తెలియడంతో ఉసూరుమంటూ ఇంటిదారి పట్టారు.
వీరు బోయినపల్లి మండలం మర్లపేటకు చెందిన పర్లపల్లి లక్ష్మీ, దుర్గయ్య దంపతులు. ఈ వృద్ధ దంపతులకు బ్యాంకు ఖాతాను స్థానిక బ్యాంకు అధికారులు బతికి ఉండగానే చనిపోయినట్లుగా తొలగించారట. ఆసరా పింఛన్ రావడం లేదని, ఎకరం భూమి ఉన్నా.. బ్యాంకు ఖాతా లేక.. రైతు భరోసా పైసలు రావడం లేదనే సమస్యను విన్నవించేందుకు కలెక్టరేట్కు వచ్చారు. కానీ అధికారులు ఎవరూ లేక ఎండలోనే ఇంటిదారి పట్టారు.

ప్రజావాణి లేదని తెలువక..

ప్రజావాణి లేదని తెలువక..