
వేతన వెతలు
● మూడు నెలలుగా అందని వేతనాలు ● ఆర్థిక ఇబ్బందుల్లో ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు
గంభీరావుపేట(సిరిసిల్ల): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు సకాలంలో వేతనాలు అందడం లేదు. మూడు నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. క్రమం తప్పకుండా కూలీలతో పనులు చేయిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు మూడు నెల లు గా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు.
రూ.55లక్షలు పెండింగ్
జిల్లాలో 153 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి దాదాపు రూ.55లక్షల వేతనాలు అందాల్సి ఉంది. మూడు నెలలుగా పెండింగ్లో ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో కూలీలకు ఎక్కువ పనులు కల్పించడానికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా హరితహారం, డంపింగ్యార్డులు, నీటి నిల్వ పనులు, నర్సరీల నిర్వహణ, భూములు చదునుచేయడం, పూడికతీత పనులను కూలీలతో చేయిస్తూ పర్యవేక్షిస్తున్నారు. భారమైన పనులు చేస్తున్నప్పటికీ సకాలంలో వేతనాలు అందడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమలుకు నోచుకోని హామీ
ఉపాధిహామీ పథకంలో 2006 నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. తమకు పేస్కేల్ విధానం అమలు చేయాలనేది ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రధాన డిమాండ్. ప్రభుత్వం వీరికి పేస్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చి ఏడాది గడిచినా ఆ దిశగా ముందడుగు పడడం లేదు.
ఇబ్బంది పడుతున్నాం
సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే పెండింగ్ వేతనాలను విడుదల చేయాలి. క్షేత్రస్థాయిలో ఎంతో కష్టపడి పనిచేస్తున్న మమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పే స్కేల్ విధానం అమలు చేయాలి. – మధు,
ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు

వేతన వెతలు