
పర్యాటకంపై పట్టింపు కరువు
● ఎగువమా‘నీరు’లో బోటింగ్ కోసం ఎదిరిచూపులు ● గతంలోనే గెస్ట్హౌస్ వద్ద పార్క్, ఫౌంటేయిన్ ● నేడు కనిపించని గ్రీనరీ
నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు
గంభీరావుపేట(సిరిసిల్ల): ఎగువమానేరు పర్యాటకంపై అధికారులకు పట్టింపు కరువైంది. బోటింగ్ సౌకర్యం కల్పిస్తామన్న హామీలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా పరిస్థితి ఉంది. మండు వేసవిలోనూ జలాశయం నిండుకుండలానే ఉన్నా బోటింగ్పై అధికారులు శ్రద్ధ చూపడం లేదు.
పురాతన అతిథిగృహం
ప్రాజెక్టు సమీపంలో ఏళ్లనాటి అతిథి గృహం ఉంది. ఇటీవల దానికి పాక్షిక మరమ్మతులు చేశారు. అక్కడి పరిసరాల్లో గార్డెన్ ఏర్పాటుకు విశాలమైన స్థలం ఉంది. కానీ ఆ ప్రదేశంలో హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. గతంలో గార్డెన్, వాటర్ఫౌంటేయిన్ ఉండేది. ప్రస్తుతం అవి లేవు. ప్రాజెక్టు కట్టపై ‘అప్పర్ మానేరు’ అనే అక్షరాలు సిమెంటుతో చేసి ఉన్నాయి. వాటిని పట్టించుకునే వారు లేరు. ప్రాజెక్టులో బోటింగ్ కోసం రెండేళ్ల క్రితం బోట్లు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎవరూ పట్టించుకోకపోవడంతో అవి ఎక్కడ ఉన్నాయో తెలియని దుస్థితి. ప్రజాప్రతినిధులు, అధికారులు.. కొంతకాలంగా బోటింగ్ మాటే ఎత్తడం లేదు.
పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ప్రయోజనం
నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు ఉంటాయి. అప్పట్లో బోట్లు తెప్పించారు. కానీ అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియడం లేదు. ఏళ్లు గడిచినా జలాశయంలో బోటింగ్ మాత్రం కనిపించడం లేదు. – మల్లేశ్యాదవ్, నర్మాల

పర్యాటకంపై పట్టింపు కరువు