● కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించండి ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడఅర్బన్/కోనరావుపేట(వేములవాడ): బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మండలం మారుపాక, చంద్రగిరి, కోనరావుపేట మండలం మల్కపేట, నాగారం, పల్లిమక్త, కనగర్తి, వెంకట్రావుపేట, కొండాపూర్, మంగళ్లపల్లి, సుద్దాల గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా హామీలను అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును భారీ మేజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ను పక్కన పెట్టినట్లుగా.. బీజేపీని కూడా పక్కన పెట్టాలని కోరారు. కేసీఆర్కు అధికారం పోగానే ప్రజలు గుర్తుకొచ్చి బస్సుయాత్ర పేరుతో వస్తున్నారన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీబంధు బీఆర్ఎస్ బంధు అయ్యిందని విమర్శించారు. దళితబంధు, ఇంటికో ఉద్యోగం, ఒక్క రేషన్కార్డు కూడా ఇవ్వలేదన్నారు. వేములవాడ నియోజకవర్గం పరిధిలో 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి అందిస్తామన్నారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. నాయకులు పిల్లి కనకయ్య, షేక్ ఫిరోజ్పాషా, కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, కచ్చకాయల ఎల్లయ్య, చేపూరి గంగాధర్, తాళ్లపెల్లి ప్రభాకర్, బొర్ర రవీందర్ తదితరులు పాల్గొన్నారు.