
మూల్యాంకనంలో తప్పులు లోకేష్ పుణ్యమే
ఒంగోలు సిటీ: పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో వేలాది మంది విద్యార్థుల మార్కులు తప్పుగా రావడం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుణ్యమేనని, ఆ తప్పిదానికి బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జోనల్ అధ్యక్షుడు దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఒంగోలు డీఈఓ కార్యాలయాన్ని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు శుక్రవారం ముట్టడించారు. డీఈఓ కిరణ్కుమార్కు పదో తరగతి పరీక్షల మూల్యాంకనానికి సంబంధించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దుగ్గిరాల నారాయణరెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ రెడ్బుక్ మీద పెట్టి శ్రద్ధ విద్యారంగం మీద చూపించడం లేదని విమర్శించారు. కూటమి పాలనలో విద్యార్థుల భవిష్యత్ను గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పిదం వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ మీద తీవ్ర ప్రభావం చూపించిందన్నారు. ఏడాది పాటు కష్టపడి చదివి మంచిమార్కులు సాధించినా మూల్యాంకనంలో జరిగిన తప్పుల వల్ల ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యావకాశాలను కోల్పోయారని చెప్పారు. త్రిపుల్ఐటీకి అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల సీటు రాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు నష్టపోయారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మూల్యాంకనం తప్పిదాల వలన ట్రిపుల్ఐటీ సీట్లు కోల్పోయిన వారికి ప్రత్యేకంగా అడ్మిషన్లు నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ ఐటీతో పాటు గురుకుల జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు లభించక అన్యాయమైన విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. ఎలాంటి రుసుం లేకుండా ప్రతి విద్యార్థికి చెందిన జవాబు పత్రాలను సక్రమంగా రీవాల్యుయేషన్ చేయాలని, తుది ఫలితాలు విడుదల చేసేంత వరకు పదో తరగతి మార్కుల ఆధారంగా నిర్వహిస్తున్న వివిధ విద్యా సంస్థల అడ్మిషన్లను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. మూల్యాంకనంలో చేసిన తప్పులకు బాధ్యులైన ఉన్నతాధికారులపైన, విద్యామంత్రి లోకేష్ పైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వైఎస్సార్ సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి మాట్లాడుతూ బాధ్యులైన అందరిపైనా చర్యలు చేపట్టాలని, దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించిన తమ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిపై గంజాయి కేసు పెట్టి జైల్లో పెట్టారని, ఇది అత్యంత దుర్మార్గమన్నారు. ఇటువంటి బెదిరింపులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం భయపడదని, పోరాటం ఇంకా ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో జోనల్ సెక్రటరీ నారాయణ రెడ్డి, మహేంద్ర రెడ్డి, వేముల శ్రీకాంత్, ఖాదర్ బాషా, సాయి, దావీదు, విక్రమ్, వాసు, నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ తప్పిదాన్ని ప్రశ్నించిన వారిపై
గంజాయి కేసు పెట్టడం దుర్మార్గం
విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం డిమాండ్
డీఈఓ కార్యాలయం ముట్టడి