
ప్రాణదాతలుగా పశువైద్యులు
ఒంగోలు సబర్బన్: మూగజీవాల పాలిట ప్రాణదాతలుగా పశు వైద్యులు అందిస్తున్న వైద్య సేవలు అభినందనీయమని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. శనివారం ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ప్రపంచ పశువైద్య దినోత్సవంలో కలెక్టర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలుత పహల్గాంలో ఈనెల 22న ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు పాటు మౌనం పాటించారు. అనంతరం ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా విజన్ డాక్యుమెంట్లో లైవ్ స్టాక్ సెక్టార్ రూ.9,735 కోట్ల జీడీపీతో మొదటి స్థానంలో ఉందన్నారు. అలాగే పాల ఉత్పత్తిలో రాష్ట్రంలో 5వ స్థానంలో ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 17,525 కుటుంబాలు పేదరికంలో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం పి–4 విధానంలో వీరిని అభివృద్ధి చేసేలా 15 శాతం వృద్ధి రేటుతో ప్రణాళికలు రూపొందించినట్లు కలెక్టర్ చెప్పారు. పాడి పరిశ్రమలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు అధికారులు తమ వంతు కృషి చేయాలన్నారు. పశు సంవర్ధక శాఖ సిబ్బందికి నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు కలెక్టర్ మెమొంటోలు అందజేశారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, పశు సంవర్ధక శాఖ జేడీ డా.బేబీ రాణి, పశు సంవర్ధక శాఖ మార్కాపురం, ఒంగోలు ఉపసంచాలకులు డాక్టర్ రాఘవయ్య, డాక్టర్ రమేష్ బాబు, జిల్లా బహుళార్ధ పశు వైద్యశాల ఉపసంచాలకులు డాక్టర్ జగత్ శ్రీనివాసులు, ఐఎస్డీపీ సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట రామిరెడ్డి, త్రోవగుంట ఏడీ బనవ శంకర్, జిల్లా పశువైద్యాధికారులు సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బత్తుల బాలకృష్ణ, కోశాధికారి డాక్టర్ చంద్ర శేఖర్, రిటైర్డ్ పశు వైద్యాధికారులు డాక్టర్ తాతారావు, డాక్టర్ ఏసురత్నం, డాక్టర్ సోమయ్యతో పాటు వైద్యులు పాల్గొన్నారు.
ప్రపంచ వెటర్నరీ డే కార్యక్రమంలో కలెక్టర్