
అలసత్వం వహిస్తే చర్యలు
ఒంగోలు సబర్బన్: ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల పురోగతిపై అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం డ్వామా అధికారులు, ఎంపీడీవోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల పురోగతిపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు చేపట్టడానికి వేసవి అనుకూలం అయినందున పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిర్దేశించిన లక్ష్యాలు పూర్తిచేయాలన్నారు. పనుల పురోగతిపై అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. లేబర్ మొబిలైజేషన్లో త్రిపురాంతకం, ముండ్లమూరు, తాళ్లూరు, హెచ్ఎంపాడు, గిద్దలూరు మండలాలు లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్నాయన్నారు. కూలీలకు రోజువారి సగటు వేతనం రూ.307 తగ్గకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. పుల్లలచెరువు, పెద్డారవీడు, దోర్నాల, దొనకొండ, పామూరు, జరుగుమల్లి, పీసీపల్లి, తాళ్లూరు, వై పాలెం, అర్ధవీడు మండలాల్లో గత వారం కంటే ఈ వారం కూలీలకు రోజువారి సగటు వేతనం తగ్గిందని, ఈ మండలాల్లో సగటు వేతనం తగ్గడానికి కారణాలను కలెక్టర్ సంబంధిత ఎంపీడీఓలను, ఏపీఓలను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన కారణాలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనుల విధులపై కనీసం అవగాహన లేకుండా ఎలా పని చేస్తున్నారని నిలదీశారు. లక్ష్యం మేరకు పశువుల నీటి తొట్టెలు, ఫారం పాండ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఎంపీడీఓలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణాలపై అవసరమైన మేరకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బివై), జీవన జ్యోతి యోజన పథకాలను ఉపాధి హామీ కూలీలకు వర్తించేలా క్షేత్ర స్థాయిలో ఎంపీడీఓలు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, ఎంపీడీఓలు, ఏపీడీలు, ఏపీఓలు పాల్గొన్నారు.