సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో 20 వరకు కరువు మండలాలు ఉండటం దారుణమని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. మెదక్ని సీఎం జిల్లా అని చెప్పుకొంటారని, మరి అక్కడి రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బుధవారం లోటస్పాండ్ లో ని తన కార్యాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సీనియర్ నేతలు కొండా రాఘవరెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. తెలంగాణలో కొత్త పార్టీని మరికొన్ని రోజుల్లో ప్రారంభించబోతున్న వైఎస్ షర్మిల..సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
మల్లన్న ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులు ఇంకా పరిహారం కోసం పోరాడుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం పక్షపాతధోరణిని అవలంబించడం సరికాదన్నారు. చివరికి పటాన్చెరు వద్ద కాలుష్యాన్ని నియంత్రించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. దళితుల దగ్గర భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుత పాలనలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2006 లో మెదక్ను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చి నిధులు వచ్చేలా చేశారని, ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్తో 5.16 లక్షల ఎకకాలకు సాగు నీరందించాలని వైఎస్ తాపత్రయపడ్డారని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్ అభిమానులు పిట్టా రాంరెడ్డి, ఇందిరా శోభన్, వాడుక రాజగోపాల్, ర్యాలీ చంద్రశేఖర రాజు, గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డి, జగదీశ్వర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చదవండి: హలో వెంకటయ్య.. నేను హరీశ్ను!
సజ్జల కుటుంబానికి షర్మిల పరామర్శ
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు సజ్జల దివాకర్రెడ్డి మృతిపట్ల వైఎస్ షర్మిల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బుధవారం షర్మిల తన తల్లి విజయమ్మతో కలిసి దివాకర్రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు.