బాబు పల్లకీ మోయడమే పవన్‌ అజెండా

Sajjala Ramakrishna Reddy comments over Chandrababu Naidu and Pawan Kalyan - Sakshi

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

కాపుల ఓట్ల కోసం పవన్‌ను ఎరగా వేసిన చంద్రబాబు 

కులాలపరంగా ప్రజలు ఓట్లు వేస్తారన్నది భ్రమే 

చేసిన సేవ, విశ్వసనీయత ఆధారంగానే ఓట్లు  

2019 ఎన్నికల్లో, ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ ఇందుకు నిదర్శనం 

కాపులు, అభిమానుల కలలు తాకట్టు.. ఇష్టపూర్వకంగా బలిపశువుగా మారిన పవన్‌ 

పవన్‌ చెబుతున్నట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు లేదు.. ఉన్నదల్లా సానుకూల ఓటే 

వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అఖండ విజయం ఖాయం 

సాక్షి, అమరావతి/శంషాబాద్‌ (హైదరాబాద్‌): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పల్లకీ మోయడమే తన అజెండా అని జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ చాటి చెప్పారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో, తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలలో కులాల గురించి ఆలోచించడం తప్పని, అయితే చంద్రబాబు అదే చేస్తారని ధ్వజమెత్తారు.

టీడీపీకి దూరమైన కాపు సామాజిక వర్గానికి పవన్‌ కళ్యాణ్‌ను ఎరగా వేసి.. ఓట్లు రాబట్టాలని చంద్రబాబు పథకం వేస్తున్నారని ఆరోపించారు. కానీ.. ఆ పథకం చెల్లుబాటు కాదన్నారు. కులాలపరంగా ప్రజలు ఓట్లు వేయరని.. చేసిన సేవ, విశ్వసనీయత ఆధారంగానే ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 151 స్థానాల్లో విజయం సాధించడం.. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేయడం, గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టడమే అందుకు నిదర్శనమని గుర్తు చేశారు.

తాను సీఎం అయితే చూడాలనుకున్న అభిమానులు, కాపు సామాజికవర్గం కలలను చంద్రబాబుకు పవన్‌ కళ్యాణ్‌ తాకట్టు పెట్టారన్నారు. తమ కలలను పవన్‌ కల్లలుగా మార్చిన నేపథ్యంలో అభిమానులు, కాపులు వారి వెంట నడవరని స్పష్టం చేశారు. చంద్రబాబు రాజకీయ కుతంత్రంలో పవన్‌ కళ్యాణ్‌ ఇష్టపూర్వకంగా బలి పశువుగా మారారని చెప్పారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. 

చంద్రబాబు కోసమే జనసేన  
  సీఎం వైఎస్‌ జగన్‌ కంటే ముందే పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. చంద్రబాబు కోసమే జనసేనను స్థాపించారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు పలికారు. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా చంద్రబాబును అధికారంలోకి తేవాలనే లక్ష్యంతో విడిగా పోటీ చేశారు.  
♦ జనసేన పోటీ చేసిన 137 స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులను చంద్రబాబే ఖరారు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును సీఎం పీఠంపై కూర్చోబెట్టడమే ధ్యేయంగా పవన్‌ కళ్యాణ్‌ పని చేస్తున్నారు. రాజకీయ ప్రస్థానంలో సీఎం వైఎస్‌ జగన్‌లా ప్రజలతో మమేకమై.. వారి మన్ననలు పొంది, రాజకీయ శక్తిగా ఎదగాలని పవన్‌ ఎన్నడూ ఆలోచించలేదు. తాను రాజకీయ శక్తిగా ఎదిగితే చంద్రబాబుకు ఇబ్బంది అవుతుందని పవన్‌ కళ్యాణ్‌ భావించారేమో. 
ఒంటరిగా పోటీ చేసే సత్తా లేకే..  
♦ గత ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ.. గెలిచింది 23 స్థానాల్లోనే. జనసేన పోటీ చేసిన 137 స్థానాల్లో గెలిచింది ఒక్క స్థానమే. ప్రస్తుతం రాష్ట్రంలో ఒంటరిగా 175 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి పెట్టలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు. టీడీపీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం నింపడానికే పొత్తులు అంటూ పవన్‌ కళ్యాణ్‌తో చంద్రబాబు మాట్లాడిస్తుంటారు.  
♦ 2019 ఎన్నికల్లో 30 స్థానాల్లో గెలిపించి ఉంటే.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులను పోటీకి పెట్టేవాడినని పవన్‌ కళ్యాణ్‌ అనడం అవివేకం. జనసేన ఓటమి బాధ్యత ప్రజలపై వేయడం దుర్మార్గం. సీఎం పదవి రేసులో తాను లేనన్న పవన్‌.. మారీచులైన రామోజీ, రాధాకృష్ణ, టీవీ5 నాయుడులతో కలిసి చంద్రబాబును తక్షణమే సీఎం పీఠంపై కూర్చో­బెట్టడమే తన ధ్యేయమని చాటిచెప్పుకున్నారు.  
♦ పవన్‌ కళ్యాణ్‌ చెబుతున్నట్టుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు లేదు. ప్రభుత్వ సానుకూల ఓటు విపరీతంగా ఉంది. టీడీపీ తరఫున పోటీ చేయడానికి  అభ్యర్థులు దొరకకే ముందస్తు ఎన్నికలంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారు. ప్రజల ఆశీస్సులు, ఆదరణతో వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించడం ఖాయం.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top