ఇసుక అక్రమ రవాణా కట్టడికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ రవాణా కట్టడికి చర్యలు

Mar 27 2024 12:00 AM | Updated on Mar 27 2024 12:00 AM

 మాట్లాడుతున్న కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ - Sakshi

మాట్లాడుతున్న కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపడితే భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందని, ఇసుక రీచ్‌ల వద్ద తవ్వకాలను అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం అడిషనల్‌ కలెక్టర్‌ అరుణశ్రీతో కలిసి ఇసుక రవాణాపై స మీక్షించారు. చెక్‌డ్యాంలకు 500 మీటర్ల సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు పాటించని ఇసుక వాహన డ్రైవర్ల లైసన్సులు రద్దు చేస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు. సాయంత్రం ఆరు గంటలు దాటితే రీచ్‌ల నుంచి ఇసుక తరలింపు ఆపేయాలని సూచించారు. ప్రభుత్వ పనులకు అవసరమైన ఇసుకను ఆర్డీవో, తహసీల్దార్‌ అనుమతితో తీసుకెళ్లాలని కలెక్టర్‌ సూచించారు. టీఎస్‌ఎండీసీ కేటాయించిన రీచ్‌ల నుంచే నిబంధనల ప్రకారం ఇసుక తరలింపు పక్కాగా ఉండాలని ఆయన చెప్పారు. స్థానిక అవసరాల కోసం గ్రామస్తులు ఇతసుక తీసుకెళ్లేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి అనుమతిస్తారని ముజమ్మిల్‌ఖాన్‌ వివరించారు. 3 క్యూబిక్‌ మీటర్ల ఇసుక పట్టే వాహనంలోనే రవాణా చేసేందుకు అనుమతులివ్వాలని కలెక్టర్‌ సూచించారు.

జిల్లాలో 26 రీచ్‌లు..

జిల్లాలో 26 ఇసుక రీచ్‌లు ఉన్నా ప్రస్తుతం 18 రీచ్‌ల నుంచే రవాణా సాగుతోందని కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ తెలిపారు. స్థానిక అవసరాలు, ప్రభుత్వ నిర్మాణాలకు కేటాయింపులు పూర్తయ్యాకే టీఎస్‌ఎండీసీకి ఇసుక రీచ్‌లు కేటాయిస్తామని వివరించారు. ఇసుక రవాణా పారదర్శకంగా జరిగేలా చూసేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు అందిన వెంటనే క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారమయ్యేలా వ్యవస్థను పకడ్బందీగా రూపొందిస్తామని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో గంగయ్య, డీపీవో ఆశాలత, మైనింగ్‌ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఒకటి నుంచి ధాన్యం కొనుగోళ్లు

జిల్లాలో ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ తెలిపారు. ఈసారి 3,04,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించామని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 305 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని వివరించారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, అడిషనల్‌ కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చే రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ తెలిపారు. సీఎంఆర్‌, రారైస్‌ డెలివరీ సకాలంలో జరిగేలా పర్యవేక్షిస్తామన్నారు. తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక దృష్టి సారించామని, అత్యవసర మరమ్మతులకు ఆదేశించామని అన్నారు. జిల్లా అధికారులు ఆదిరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, నరేందర్‌, రవీందర్‌, శ్రీమాల, ప్రేంకుమార్‌, ఏవో శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement