
ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు
నృసింహుని బ్రహ్మోత్సవాలకు
ధర్మపురి: ధర్మపురి నృసింహుడి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈనెల 20నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలతోపాటు నిజామాబాద్, నిర్మల్, ఆర్మూర్ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. వారికి సరిపడా కల్పించాల్సిన వసతులపై ఆలయ అధికారులు శాఖల వారీగా ప్రణాళిక రూపొందించుకున్నారు.
అధికారుల పక్కా ప్రణాళిక
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలు, రాజగోపురాలు, బ్రహ్మపుష్కరిణి వద్ద, గోదావరిలో చలువ పందిళ్లు, సీ్త్రలు బట్టలు మార్చుకునేందుకు తడకలతో డ్రెస్సింగ్ రూంలు, షెడ్లు, తాగునీటి వసతి కల్పిస్తున్నారు. ముఖ్యంగా వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే భక్తుల కోసం పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ముద్రించి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆలయాలు, రాజగోపురాలు, స్వాగత తోరణాలకు రంగురంగుల విద్యుదీపాలంకరణకు చర్యలు తీసుకుంటున్నారు.
బ్రహ్మపుష్కరిణి (కోనేరు)లో పాతనీటిని తొలగించి కొత్త నీటిని నింపుతున్నారు.
కోనేరులోని చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు.
భక్తులకు ఆలయం తరఫున, స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో ఆలయంతోపాటు గోదావరి తీర ప్రాంతాల్లో చలివేంద్రాలు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు.
అన్నదానం కోసం రైసుమిల్లర్లు, ఆర్యవైశ్యులు, వర్తక సంఘం, ఇతర దాతల సహకారం తీసుకుంటున్నారు.
జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో సుమారు 400 మంది పోలీస్ బందోబస్తుకు చర్యలు చేపడుతున్నారు.
వాహనాల పార్కింగ్కు ప్రత్యేక స్థలాలను పరిశీలిస్తున్నారు.
స్వామివారి కల్యాణానికి ఆలయంలో స్థలం ఇరుకుగా ఉన్నందున మరోచోట చేయించడానికి చర్యలు చేపడుతున్నారు.
భక్తుల భద్రత నిమిత్తం ఆలయం, గోదావరి తీరప్రాంతం, బస్టాండ్ ఏరియా, ప్రధాన కూడళ్లలో దేవస్థానం, పోలీస్ సంయుక్త పర్యవేక్షణలో 60వరకు సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నారు.
20 నుంచి వచ్చేనెల ఒకటో తేదీ వరకు..
ధర్మపురిలో కొనసాగుతున్న పనులు

ధర్మపురిలో ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణాలు