
ఇంటింటికీ తాగునీరు అందించడమే లక్ష్యం
● కేంద్ర పరిశీలన బృందం సభ్యురాలు
తరుణ డోలియా
గరుగుబిల్లి: గ్రామాల్లోని ప్రతి ఇంటికీ తాగునీటిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని జల్జీవన్ మిషన్ కేంద్ర పరిశీలన బృందం సభ్యురాలు, కామర్స్ ఇండస్ట్రీ డైరెక్టర్ తరుణ డోలియా అన్నారు. గరుగుబిల్లి మండలంలోని చినగుడబ పంచాయతీ గదబవలస గ్రామంలో జేజేఎం నిధులు రూ. 8.6 లక్షలతో నిర్మించిన రక్షిత మంచి నీటి పథక నిర్మాణాన్ని ఆమె తన బృందం సభ్యులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో సైతం ప్రతి ఇంటికీ తాగునీటిని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్జీవన్ మిషన్ పథకంలో నిధులను మంజూరు చేసిందన్నారు. నిధుల వినియోగంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సైంటిస్టు డి.అనంతరావు, మండల ప్రత్యేకాధికారి ఒ.ప్రభాకరరావు, ఎంపీడీఓ జి.పైడితల్లి, తహసీల్దార్ పి.బాల, డిప్యూటీ ఎంపీడీఓ ఎల్. గోపాలరావు, ఆర్డబ్ల్యూఎస్ జేఈ గౌరీశంకరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు.