
అధికారిక లాంఛనాలతో ఆర్మీ జవాను అంత్యక్రియలు
బాడంగి: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆర్మీ జవాన్ సత్యం మృదేహానికి అధికారిక లాంఛనాలతో బుధవారం అంత్యక్రియలు జరిగాయి. బొబ్బిలి మండలం పారాది సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాడంగి మండలంలోని ముగడ గ్రామానికి చెందిన జవాను తూముల సత్యం మృతిచెందిన విషయం తెలిసిందే. బొబ్బిలిలో శవపంచాయతీ ఆనంతరం సత్యం మృతదేహాన్ని స్వగ్రామం ముగడ తరలించారు. బుధవారం ఉదయం ఆయన పనిచేస్తున్న దగ్గర నుంచి మిలటరీ అధికారి, పోలీసులు వ్యాన్పై ముగడ గ్రామానికి చేరుకుని సత్యం మృతదేహాన్ని పూలమాలలతో అలంకరించి, మృతదేహంపై జాతీయజెండా అవగతం చేసి గాలిలోకి కాల్పులు జరిపి గౌరవవందనం చేశారు. అనంతరం అంత్యక్రియలకు శ్మశానానికి పోలీసులే మృతదేహాన్ని మోసుకుని వెళ్లారు. అంతకుముందు భార్య నాగరత్నానికి దహన సంస్కారాల కోసం ప్రభుత్వం సమకూర్చిన నగదును అందజేశారు. ఆమె కుమార్తె హిమబిందుతో కలిసి మృతదేహాన్ని కడసారిగా చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కుమారుడు అరవింద్ తండ్రికి తలకొ రివి పెట్టగా దహన సంస్కారాలు పూర్తిచేశారు. మృతుడి అన్నదమ్ములతో పాటు బంధువులు, ప్రజలు పెద్దసంఖ్యలో గుమిగూడి నివాళులర్పించారు. తహసీల్దార్ సుధాకర్, ఎస్సై తారకేశ్వరరావు, వీఆర్ఓ దేవి, కార్యదర్శి సూర్యారావు ప్రభుత్వం తరఫున హాజరయ్యారు.