
ఐఈఆర్పీల ఇంటింటి సర్వే
దివ్యాంగ చిన్నారుల కోసం
ప్రతి ఒక్కరినీ గుర్తించేందుకే..
ప్రతి ఒక్కరినీ ఈ పథకం కిందకు తీసుకురావాలనే ఉద్దేశంతో సర్వే నిర్వహిస్తున్నాం. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను అందిస్తాం. భవిత కేంద్రాలకు రాని వారికి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషను అందిస్తున్నాం. భవిత కేంద్రాల పరిధిలో విద్యతో పాటుగా అవసరమైన సేవలు అందించేందుకు సర్వే నిర్వహిస్తున్నాం. ప్రతి చిన్నారిని గుర్తించి, భవిత కేంద్రాల్లో చేర్చిస్తాం. ఇంతవరకు జిల్లాలో 18మందిని గుర్తించి వారిని అంగన్వాడీ కేంద్రాలు, భవిత కేంద్రాలలో చేర్పించాం.
– పి.భానుమూర్తి,
సహిత విద్య కోఆర్డినేటర్,
పార్వతీపురం మన్యం జిల్లా
పార్వతీపురం: దివ్యాంగ చిన్నారులను గుర్తించేందుకు సహిత విద్య ఐఈఆర్పీ(ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్)లు ఇంటింటి సర్వే ప్రారంభించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఇంటికి పరిమితం కాకుండా వారిని శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన భవిత కేంద్రాల పరిధిలో ఈ గుర్తింపునకు ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలు మిగిలిన పిల్లల మాదిరిగానే అన్ని అవకాశాలను అంది పుచ్చుకునే విధంగా ప్రతి మండలానికి ఒక భవిత కేంద్రాన్ని ఏర్పాటు చేసి సహిత విద్యను అమలు చేస్తున్నారు. జిల్లాలోని 15 మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున 15 భవిత కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మిగిలిన పిల్లలతో సమానంగా విద్యను అందించడంతో పాటు వారికి అవసరమైన పరికరాలను ఆందిస్తున్నారు. సమాజంలో ఇంకా మిగిలి వున్న ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించడానికి జిల్లా విద్యాశాఖాధికారి, అడిషనల్ ప్రోజెక్టు కోఆర్డినేటర్, సహిత విద్య జిల్లా కోఆర్డినేటర్ల పర్యవేక్షణలో భవిత కేంద్రాల ఐఈఆర్పీలు సర్వే చేస్తున్నారు. ఇందులో భాగంగా దివ్యాంగ పిల్లలందరికీ అవసరమైన విద్యను అందించడం, ప్రతి చిన్నారిని వారి వయసుకు తగ్గట్టుగా పాఠశాలలో చేర్చించడమే లక్ష్యంగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే దివ్యాంగ పిల్లల విద్యను డిజిటలైజేషన్ చేసి, టాబ్స్ను అందజేస్తున్నారు.
ప్రత్యేక సేవలు
మానసిక దివ్యాంగుల్లో విద్యార్థి దశలో ఉన్న వారికి విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు ప్రతీ వారం పిజియోథెరపీ సేవలను అందజేస్తున్నారు. ప్రత్యేక అవసరాలు గల వారిని గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించడం, పాఠశాలలకు రప్పించేలా భవిత కేంద్రంలోని ఐఈఆర్పీలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి ప్రతి మండలంలో ప్రత్యేక అవసరాలు గల చిన్నారులను గుర్తించేందుకు ఐఈఆర్పీలు ప్రత్యేక సర్వే చేపట్టారు. జిల్లాలో 1,749 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారు. వీరిలో 1738 మంది భవిత కేంద్రాలలో విద్యనభ్యసించగా, మిగిలిన 11మందిని వారి ఇళ్ల వద్దనే ప్రత్యేకంగా విద్యనందిస్తున్నారు. వీరు కాకుండా, గతేడాది జూన్లో నిర్వహించిన సర్వేలో పాఠశాలలకు రాకుండా ఇంటి వద్ద ఉన్న 286 మందిని గుర్తించారు. ప్రస్తుతం నిర్వహించిన సర్వే అనంతరం గుర్తించిన వారిని అంగన్వాడీ కేంద్రంలోగానీ ప్రాథమిక పాఠశాలల్లోగానీ చేర్పిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా సెలవు రోజుల్లోనే సర్వే చేయాలని అధికారులు ఐఈఆర్పీలను ఆదేశించారు. స్థానిక అంగన్వాడీ వర్కర్లు, ఏఎన్ఎంలు, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ల సహాయంతో సర్వే నిర్వహిస్తున్నారు. ఇంతవరకు జిల్లాలో 18మందిని గుర్తించారు.
ప్రత్యేక వైద్య శిబిరాలు
సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో మెడికల్ అసెస్మెంట్ క్యాంపులు నిర్వహించారు. పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన శిబిరాల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అవసరమైన ఉపకరణాలను గుర్తించి, వాటి కోసం దరఖాస్తులు స్వీకరించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారిని గుర్తించి, మెంటల్లీ రిటార్డెడ్ (ఎంఆర్), హియరింగ్ ఇంపైర్డ్(హెచ్ఐ), విజువల్లీ ఇంపైర్డ్(వీఐ), సెరిబ్రల్ పాలసీ కింద నాలుగు విభాగాలుగా విభజించారు. ఈ క్యాంపులకు పాఠశాలలకు రాకుండా ఇంటి వద్ద ఉండేవారు కూడా వచ్చారు.
నాలుగు రకాల అలవెన్స్లు
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు నాలుగు రకాల అలవెన్స్లను ప్రభుత్వం అందజేస్తోంది. ఎస్కార్ట్, ట్రాన్స్ఫోర్టు్, హోమ్ బేస్డ్, రీడర్ అలవెన్సును అందజేస్తున్నారు. అంధులకు రీడర్ అలవెన్స్గా 10 నెలలకు రూ.2,000 అందజేస్తున్నారు. బడికి వచ్చే వారికి ఎస్కార్ట్ అలవెన్స్ కింద ఒక్కో విద్యార్థికి పది నెలలకు రూ.3,000 అందిస్తున్నారు. ట్రాన్స్పోర్టు అలవెన్స్ పది నెలలకు రూ.3,000 ఇస్తున్నారు. గర్ల్ చైల్డ్ అలవెన్స్ 10 నెలలకు రూ.2,000 అందజేస్తున్నారు. హోమ్ బేస్డ్ అలవెన్స్ పది నెలలకు రూ.3,000 అందజేస్తున్నారు.
ఈ నెల 13 నుంచి ప్రారంభమైన సర్వే
దివ్యాంగులకు నాలుగు రకాల అలవెన్సులు
గుర్తించేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలు

ఐఈఆర్పీల ఇంటింటి సర్వే

ఐఈఆర్పీల ఇంటింటి సర్వే

ఐఈఆర్పీల ఇంటింటి సర్వే