
జిల్లాలో 38.8 మిల్లీమీటర్ల వర్షం
నరసరావుపేట: జిల్లాలో అడపా తడపా అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లాలో 38.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. గత మే నెల 25తో ప్రారంభమైన రోహిణీ కార్తె ఈనెల ఎనిమిదవ తేదీతో గుడ్బై చెప్పింది.. అయితే నాలుగైదురోజులుగా జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఇంకా ఎండలు కొనసాగే అవకాశం కన్పిస్తుంది. అత్యధికంగా మాచవరంలో 10.4 మి.మీ, అమరావతిలో 8.4 మి.మీటర్ల వర్షం కురిసింది. బొల్లాపల్లిలో 2.4, వినుకొండలో 4.8, ఈపూరులో 5.2, క్రోసూరులో 1.8, వెల్దుర్తిలో 5.0 మి.మీ వర్షం కురిసింది. కాగా ఈనెలలో గడిచిన ఎనిమిదిరోజుల వ్యవధిలో జిల్లాలోని 28 మండలాల పరిధిలో సాధరణ వర్షపాతం 584.6 మి.మీటర్ల వర్షం కురవాల్సివుండగా కేవలం 62.4 మి.మీటర్ల మాత్రమే నమోదైంది. జిల్లా కేంద్రమైన నరసరావుపేటతో పాటు చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల, రొంపిచర్ల, శావల్యాపురం, నూజెండ్ల, నకరికల్లు, రాజుపాలెం, సత్తెనపల్లి, పెదకూరపాడు, అచ్చంపేట, బెల్లంకొండ, పిడుగురాళ్ల, కారంపూడి, దాచేపల్లి, గురజాల, రెంటచింతల, మాచర్ల మండలాల్లో ఇప్పటి వరకు వర్షం నమోదు కాలేదు.
బాలికతో యువకుడి అసభ్యప్రవర్తన
వినుకొండ: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి ఆమె కుటుంబసభ్యులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన వినుకొండ పట్టణంలోని ఇందిరానగర్లో ఆదివారం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అప్పడే ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు గుర్తించి యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
నకరికల్లు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నకరికల్లులోని ఇనిమెట్ల రోడ్డులో ఆదివారం జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన చందా మీరావలి(38) నకరికల్లులోని ఇనిమెట్ల రోడ్డులో గల మద్యం దుకాణం వద్ద అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్ఐ చల్లా సురేష్, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడు కొన్నిరోజులుగా మద్యం మత్తులో తిరుగుతున్నాడని.. ఆదివారం కూడా మద్యం తాగేందుకు నకరికల్లు వచ్చినట్లు సమాచారం. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చల్లా సురేష్ తెలిపారు.