
కౌలు రైతులకు రుణాలు పెంచాలి
గుంటూరు వెస్ట్: జిల్లాలో కౌలు రైతులకు ఇవ్వాల్సిన రుణ లక్ష్యాలను ఆశించిన స్థాయిలో బ్యాంకర్లు పూర్తి చేయలేదని, దీన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్తేజ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో 2025 త్రైమాసికానికి సంబంధించి డీసీసీ, డీఎల్ఆర్సీ బ్యాంకర్ల సమవేశం జరిగింది. ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ కౌలు రైతులకు రూ. 180 కోట్ల రుణ లక్ష్యం కాగా, రూ. 60 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్నారు. దీన్ని మరింత పెంచి పెండింగ్ రుణాలు అందించాలన్నారు. విద్య, గృహ రుణాలు పెంచేందుకు బ్యాంకర్లు, విద్యా సంస్థలు, ఇంజినీరింగ్ కళాశాలలు, తదితర రద్దీ ప్రాంతాల్లో రుణ మేళా నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సహించాలన్నారు. దీనిలో భాగంగా కనీసం రూ. 20 వేల మందికి రుణాలు ఇవ్వాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పీఎం విశ్వకర్మ, పీఎం ఈజీసీఎం, పీఎంఎఫ్ ఎంజీ, ముద్ర రుణ లక్ష్యాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. గత ఆర్థిక సంవత్సరం 2024–25 కు సంబంధించి వ్యవసాయ రంగానికి రూ.13,613 కోట్ల రుణ లక్ష్యం కాగా, రూ.16,266 కోట్లు అంటే 119 శాతం మంజూరు చేశారన్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 9,495 కోట్లు రుణ లక్ష్యం కాగా, రూ. 10,679 కోట్లు అంటే 112 శాతం మంజూరు చేశారన్నారు. ప్రాధాన్యత రంగానికి సంబంధించి విద్యా రుణాలు రూ.114.5 కోట్లు లక్ష్యం కాగా, రూ.95.87 కోట్లు మంజూరు చేశారన్నారు. గృహ రుణాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని అసహనం వ్యక్తం చేశారు. దీనిలో రూ.664 కోట్లు లక్ష్యం నిర్ణయిస్తే, రూ.182 కోట్లు అంటే కేవలం 27.5 శాతం మాత్రమే మంజూరు చేశారని తెలిపారు. మొత్తం వార్షిక రుణ లక్ష్యం రూ.34,730 కోట్లకు గాను, రూ.44,918 కోట్లు అంటే రూ.129 కోట్లు మంజూరు చేసి రుణ లక్ష్యాలను దాటినందుకు బ్యాంకర్లను అభినందిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం జిల్లాకు సంబంధించి నాబార్డు పీఎల్పీ 2025 –26 పుస్తకాన్ని ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్తేజ, యూడీఐ రీజనల్ హెడ్ జవహర్, జిల్లా లీడ్బ్యాంకు మేనేజర్ మహిపాల్రెడ్డి, నాబార్డు డీడీఎం శరత్, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఆర్బీఐ ఎల్డీవో నవీన్లు ఆవిష్కరించారు.
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్తేజ