తల్లికి వంచన | - | Sakshi
Sakshi News home page

తల్లికి వంచన

Jun 3 2025 5:29 AM | Updated on Jun 3 2025 5:29 AM

తల్లి

తల్లికి వంచన

‘‘నీకు రూ.15 వేలు...నీకు రూ.15 వేలు... ముగ్గురుంటే రూ.45 వేలు’’ ఈ మాటలు ఎక్కడో విన్నట్లు ఉంది కదా. సరిగ్గా ఏడాది కిందట(ఎన్నికల ముందు) చంద్రబాబు ఆ పార్టీ నాయకులు తల్లులకు ఇచ్చిన హామీ. తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటను మరిచారు. తల్లికి వందనం అంటూ వంచించారు. రెండో ఏడాది కూడా డబ్బులు ఇస్తారో లేదో తెలియదు. కూలినాలి చేసుకునే తల్లిదండ్రులు పిల్లలను బడులకు పంపేందుకు అవస్థలు పడుతున్నారు. కొంతమంది మధ్యలో చదువులకు స్వస్తి పలుకుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తీరుపై విద్యార్థుల తల్లులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
● కూటమి ప్రభుత్వంలో దగా పడ్డ తల్లులు, విద్యార్థులు ● బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని హామీ ● 2024–25 విద్యాసంవత్సరంలో ఒక్క రూపాయి ఇవ్వని కూటమి ప్రభుత్వం ● కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా త్వరలో అందజేస్తామని ప్రకటనలతో సరి ● జిల్లాలో తల్లికి వందనం కోసం ఎదురుచూస్తున్న 3,23,711 మంది విద్యార్థులు ● ప్రైవేట్‌ పాఠశాలల ఒత్తిడితో ఫీజులు కట్టడానికి ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు ● వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో అమ్మ ఒడి పేరుతో రూ.977.45 కోట్ల తల్లుల ఖాతాల్లో జమ

కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై తల్లుల ఆగ్రహం

సాక్షి, నరసరావుపేట: టీడీపీ తన మేనిఫెస్టోలో తల్లికి వందనం పేరిట పాఠశాల, ఇంటర్మీడియట్‌ చదివే విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున వారి తల్లుల ఖాతాలలో వేస్తామని తెలిపారు. బడికి వెళ్లే పిల్లాడు ఒకరుంటే రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు ... అంటూ కూటమి నేతలు ఊదరగొట్టారు. అయితే అఽధికారంలోకి వచ్చాక చంద్రబాబు తన సహజ నైజాన్ని బయటపెట్టారు. తొలి ఏడాది ఇవ్వాల్సిన తల్లికి వందనం నిధులు ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. రెండో ఏడాది విద్యా సంవత్సరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నది. ఇప్పటికీ డబ్బులెప్పుడిస్తారో చెప్పేవారు లేదు. కూటమి ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని తల్లిదండ్రులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో సంక్షేమ క్యాలెండర్‌ విడుదల చేసి చెప్పిన తేదీ ప్రకారం లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలలో నేరుగా జమ అయ్యేవని గుర్తు చేసుకుంటున్నారు. అదే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

3,23,711 మంది

విద్యార్థుల ఎదురుచూపు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్కూల్‌కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 అందజేస్తామని హామీనిచ్చారు. ఈ పథకం ప్రకారం పల్నాడు జిల్లాలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ చదివే విద్యార్థులందరికి ఒక్కొక్కరికి రూ.15వేలు అందజేయాల్సి ఉంది. పల్నాడు జిల్లాలో 2024–25 విద్యాసంవత్సరం 3,23,711 మంది విద్యార్థులకుగాను ఏడాదికి రూ.485.56 కోట్లు అందజేయాల్సి ఉంది. ప్రస్తుతం 2025–26 విద్యాసంవత్సరం బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రుల ఖాతాలలో రెండేళ్ల నగదు జమ చేయాల్సి ఉంటుంది. అంటే సుమారు రూ.971.12 కోట్లు జమ చేయాల్సి ఉంది. ఇంతవరకు తల్లికి వందనం నిధులు విడుదల చేయలేదు. దీంతో పిల్లలను బడులకు పంపుతున్న తల్లిదండ్రులు ఇబ్బందిపడుతున్నారు. గతంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా బడులు తెరచిన వెంటనే తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి నిధులు జమ అయ్యేవి. ఇలా జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో రూ.977.45 కోట్లు తల్లుల వ్యక్తిగత ఖాతాలలో జమ చేసింది.

ఇబ్బందిపడుతున్న ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న గత ప్రభుత్వంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్‌ నెలలోనే అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థిని బడికి పంపుతున్న ప్రతి తల్లికి రూ.15 వేలను బ్యాంక్‌ ఖాతాలలో జమ చేసేవారు. దీంతో విద్యార్థులు బడులకు పంపడానికి ఆర్థికంగా వెసులుబాటు కలిగేది. ముఖ్యంగా ప్రైవేట్‌ బడులకు పంపేవారికి ఈ రూ.15 వేలు ఫీజులు కట్టడానికి ఉపయోగపడేది. విద్యార్థుల పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు వంటి వస్తువులు కొనడానికి ఈ డబ్బులు ఉపయోగించేవారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఒక విద్యాసంవత్సరం పూర్తయితే మరొకటి ప్రారంభమైనా ఇంత వరకు తల్లికి వందనం నిధులు విడుదల చేయలేదు. ఇంకా ఎటువంటి కార్యాచరణ, ప్రాథమిక సర్వేలు చేయలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్‌ విద్యాసంస్థఽలు ఫీజులు అడుగుతున్నారని, ప్రభుత్వ త్వరగా నిధులు విడుదల చేస్తేనే కట్టగలమని చెబుతున్నారు. ఇప్పటికే పంటలు పండక, గిట్టుబాట ధరలు లభించక, మార్కెట్‌లో నగదు ప్రవాహం తగ్గడం వంటి కారణాలతో బడుగు, బలహీనవర్గాల కుటుంబాలకు ఈ విద్యాసంవత్సరం భారంగా మారింది. దీంతో వేలాది మంది విద్యార్థులు బడికి దూరమయ్యే ప్రమాదముందన్న ఆందోళన నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది బడి మానేసిన విద్యార్థులు అమ్మ ఒడి పథకం ద్వారా తిరిగి బడి బాట పట్టారు.

అప్పులు చేసి చదివిస్తున్నాం..

నాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి మోక్షిత్‌రెడ్డి (11) ఆరో తరగతిలో చేరనున్నాడు. చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చదువుకుంటున్నాడు. అమ్మాయి జాహ్నవి(8) నరసరావుపేటలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో నాలుగో తరగతి చదవనుంది. సొంత ఇల్లు లేదు. టీ స్టాల్‌ నిర్వహించుకుంటూ జీవనాధారం పొందుతున్నాను. గతంలో మూడేళ్లపాటు ఏటా అమ్మ ఒడి సాయం అందింది. పిల్లలను చదివించుకోవడానికి ఊరట నిచ్చింది. కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తామని చెప్పారు. నేటికీ ఇంతవరకు అందలేదు. ప్రభుత్వం సాయం అందిస్తే పిల్లల చదువుకు ఆసరాగా ఉంటుంది. అప్పులు చేసి చదివించుకోవాల్సి వస్తోంది.

– ఉండేల రామకృష్ణారెడ్డి, చాగంటివారిపాలెం, ముప్పాళ్ల మండలం

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య, ప్రభుత్వం చేసిన ఖర్చు ...

సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య రూ.కోట్లలో

2019–20 1,61,031 241.55

2020–21 1,72,772 241.88

2021–22 1,92,598 250.37

2022–23 1,87,417 243.64

జిల్లాలో నియోజకవర్గాల వారీగా తల్లికి వందనం పథకం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల సంఖ్య ...

నియోజకవర్గం విద్యార్థుల సంఖ్య

నరసరావుపేట 50,501

చిలకలూరిపేట 41,361

సత్తెనపల్లి 40,597

పెదకూరపాడు 39,685

గురజాల 51,551

మాచర్ల 50,613

వినుకొండ 49,403

మొత్తం 3,23,711

గతంలో నేరుగా బ్యాంక్‌ ఖాతాలలో జమ

మా అమ్మాయి ఈ ఏడాది ఐదో తరగతికి వెళ్లనుంది. గతేడాది తల్లికి వందనం నగదు జమ కాలేదు. ఈ ఏడాది ఇస్తామంటున్నారు, కానీ దానిపై ఎటువంటి స్పష్టత రాలేదు. త్వరగా ఆ డబ్బులు పంపిణీ చేస్తే పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో నాకు అమ్మ ఒడి పథకం ద్వారా నేరుగా బ్యాంక్‌ ఖాతాలో నగదు జమ అయ్యేవి.

–సంగు రాజ్యలక్ష్మి, రాజుపాలెం

తల్లికి వంచన 1
1/4

తల్లికి వంచన

తల్లికి వంచన 2
2/4

తల్లికి వంచన

తల్లికి వంచన 3
3/4

తల్లికి వంచన

తల్లికి వంచన 4
4/4

తల్లికి వంచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement