
ఐదున జిల్లాలో రాష్ట్ర స్థాయి యోగాంధ్ర
నరసరావుపేట: యోగాంధ్ర మాసోత్సవ వేడుకలలో భాగంగా జూన్ ఐదు గురువారం డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియం వేదికగా పదివేల మందితో రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు వెల్లడించారు. దీనికి పెద్ద ఎత్తున జిల్లా ప్రజలు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లో యోగాంధ్ర మాసోత్సవంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బుధవారం ప్రముఖ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ వద్ద ఒక వేయి మందితో సామూహిక యోగా నిర్వహిస్తామన్నారు. యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ ఉదయం గ్రామ, వార్డు సచివాలయాల వద్ద స్థానికులతో సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
యోగా చేసిన వ్యవసాయ శాఖ ఉద్యోగులు
యోగాంధ్రలో భాగంగా సోమవారం పల్నాడు బస్టాండ్, పెద్దచెరువురోడ్డు వద్ద జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యోగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రవి మాట్లాడుతూ యోగా వల్ల మానసిక ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావాలన్నారు. సుమారు 150 మంది దాకా వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులను అరికట్టండి
రానున్న వర్షా కాలంలో జిల్లాలో సీజనల్ వ్యాధు లు, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. వారం రోజులపాటు గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ప్రతి శుక్రవారం మండల స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలన్నారు.
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు