
దేశానికి బలం ప్రజలే
భువనేశ్వర్: రైతులు, స్వయం సహాయక బృందాల మహిళలు, యువత, ఉపాధ్యాయులు, చేతివృత్తులవారు.. ఇలా అన్ని వర్గాల ప్రజలే దేశానికి బలమపి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన ఉత్కర్ష్ నిమాపడా కాంక్లేవ్ ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. సమ్మిళిత వృద్ధి, స్థానిక ఆకాంక్షలకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందన్నారు. ప్రజా కేంద్రీకృత అభివృద్ధికి అర్థవంతమైన ఆవిష్కరణకు దోహదపడే ఈ చొరవను కార్యరూపం దాల్చడంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడాను ఆయన ప్రశంసించారు. ఈ ప్రాంతంలో యువతకు సాధికారత కల్పించి స్థానిక ప్రతిభను వెలుగులోకి తెచ్చే స్టార్టప్ల ప్రోత్సాహానికి ఇటువంటి కార్యక్రమాలు వారధిగా నిలుస్తాయని ప్రోత్సహించారు. వ్యవసాయ కార్యకలాపాల ఆధునికీకరణ, డిజిటల్ వృద్ధి విస్తరణతో సమగ్ర సామర్థ్యత ఆవిష్కరణకు మార్గం సుగమం చేస్తుందన్నారు. గత 11 నెలల్లో రాష్ట్రం సమగ్ర వృద్ధిలో వ్యవసాయం, పర్యాటకం, మహిళలు, పిల్లలు వంటి కీలక రంగాల అభివృద్ధి, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు గణనీయమైన పురోగతిని సాధించాయని వివరించారు. కార్యక్రమానికి సారథ్యం వహించిన ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిదా ఈ సమావేశాన్ని నిమాపడా పురోగతికి ఒక మేలుకొలుపుగా అభివర్ణించారు. 2036 నాటికి అభివృద్ధి చెందిన ఒడిశా రూపకల్పనకు నిమాపడా కీలక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు స్పష్టమైన ప్రణాళికను రూపొందించడంలో ఈ చర్చలు సహాయపడతాయని పేర్కొన్నారు. జగత్సింగ్పూర్ లోక్సభ సభ్యుడు బిభు ప్రసాద్ తొరాయ్ ఈ సభలో ప్రసంగించారు. పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వంయి, సత్యబాది నియోజకవర్గ ఎమ్మెల్యే ఓం ప్రకాష్ మిశ్రా, పూరీ ఎమ్మెల్యే సునీల్ మహంతి, బ్రహ్మగిరి ఎమ్మెల్యే ఉపాసన మహాపాత్రొ, సీనియర్ ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దేశానికి బలం ప్రజలే