
అక్రమాలపై ఎమ్మెల్యే ఆగ్రహం
జయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి సమావేశం బుధవారం జరిగింది. సమితి అధ్యక్షులు దీప్తిమయి నాయిక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి పాలొన్నారు. ఈ సందర్బంగా ఆయన సమితిలో జరిగిన అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు నకిలీ బిల్లుల సమర్పించి నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. అటువంటి సంఘటనలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎరువులు, విత్తనాలు నల్లబజారులో విక్రయిస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే నల్ల బజారుపై చర్యలు చేపట్టాలని వ్యవసాయ విభాగ అధికారులను ఆదేశించారు. అలాగే సమితి విద్యా వ్యవస్థపై ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు విద్యాధికారి సుభాష్ చంధ్ర మఝి సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కమతా, బొరిగుమ్మ రైతులకు వెంటనే రెండు వేల బస్తాల డీఏపీ ఎరువులు సమకూర్చాలని ఫోన్ ద్వారా మార్క్ఫెడ్ అధికారిని ఆదేశించారు. 2020 నాటికి పూర్తి కావలసిన మెగా తాగునీటి ప్రాజెక్టు నేటికీ పూర్తికాకపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటర్ ప్రాజెక్టుపై సమితి సభ్యుల ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు నలుగురుతో ఒక టీమ్ను ఏర్పాటు చేయాలని బీడీవో సుకాంత కుమార్ పట్నాయక్ను ఆదేశించారు. సమావేశంలో నవరంగపూర్ ఎంపీ ప్రతినిధి రామేశ్వర జెన, కొరాపుట్ ఎంపీ ప్రతినిధి రామ చంధ్ర పాఢి, సమితి ఉపాధ్యక్షులు రాధాకాంత సామంతరాయ్, జిల్లా పరిషత్ సభ్యులు ప్రసాద్ బిడిక, నృశింహనాత్ శతపతి, బొరిగుమ్మ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ గంతాయిత్, డిక్టర్ దిలీప్ కుమార్ నాథ్, సీడీపీవో గాయిత్రీ బాహిణీపతి, ఇంజినీర్ సత్యనారాయణ సెటి పాల్గొన్నారు.