
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
శ్రీకాకుళం రూరల్: శారీరక ఆరోగ్యానికి, మానసిక దృఢత్వానికి ప్రతిఒక్కరూ యోగా సాధన చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. యోగాంధ్రలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం రూరల్ మండలం పెదగనళ్లవానిపేట సముద్ర తీరంలో సుమారు ఐదు వేల మందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారులు ప్రతిరోజూ వేటకు వెళ్తారని, వారికి యోగా చాలా ఉపయోగపడుతుందన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ మనసు, శ్వాస, వ్యాయామమే యోగాసనమన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేష్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వేంకటేశ్వరరావు, ఆర్డీవో కె.సాయి ప్రత్యూష, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.అనిత, మహిళా శిశుసంక్షేమాశాఖాధికారి బి.శాంతి, ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ జగదీష్ పాల్గొన్నారు.
పాముకాటుతో
కల్లుగీత కార్మికుడు మృతి
ఎచ్చెర్ల : అరిణాం అక్కివలస గ్రామ సమీపంలో బుడుమూరు గ్రామానికి చెందిన పొలుసు గోపి (39) మంగళవారం సాయంత్రం పాముకాటుకు గురై మృతి చెందాడు. గోపి వృత్తిరీత్యా తాటికళ్లు తీసేందుకు అరిణాం అక్కివలస వచ్చి తాటిచెట్టు ఎక్కి దిగుతుండగా పాము కాటువేసింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. గోపికి భార్య దేవి, కుమారుడు ఉన్నారు. ఎచ్చెర్ల ఎస్సై ఎన్.కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.